ఖమ్మంలో కాంగ్రెస్ దూకుడు..!
వైరా, ఏదులాపురంలో కాంగ్రెస్ ఖాతా ఓపెన్
కల్లూరు, అశ్వారావుపేటలో హోరాహోరీ పోటీ
కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితాలపై ఉత్కంఠ
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రారంభ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి. పూర్తి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్ ప్రకారం పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యం సాధిస్తూ ముందంజలో నిలుస్తున్నారు. కీలక పట్టణాల్లో వరుస విజయాలు నమోదు చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కొత్తగూడెం కార్పోరేషన్లో ఉత్కంఠ కొనసాగుతోంది
వైరా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వార్డుల్లో విజయం సాధించి ముందంజలో ఉంది. అదే విధంగా ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు వరుస విజయాలు నమోదు చేస్తూ ఆధిక్యం కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు రెండు వార్డులు కాంగ్రెస్ ఖాతాలో చేరగా, మరికొన్ని వార్డుల్లో కూడా ఆధిక్యం కొనసాగుతోంది.
కల్లూరు, అశ్వారావుపేటలో హోరాహోరీ పోటీ
కల్లూరు మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు కౌంటింగ్ కొనసాగుతుండగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ రెండు వార్డులు, బీఆర్ఎస్ పార్టీ ఒక వార్డు గెలుచుకున్నాయి. మిగిలిన వార్డుల్లో పోటీ తీవ్రంగా కొనసాగుతోంది. ముందుగా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటుందని భావించిన ఈ మున్సిపాలిటీలో తాజా ఫలితాలు కాంగ్రెస్కు కూడా అవకాశాలు ఉన్నట్లు సూచిస్తున్నాయి. అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటివరకు కాంగ్రెస్ రెండు వార్డులు, బీఆర్ఎస్ రెండు వార్డులు గెలుచుకోగా, బీజేపీ ఒక వార్డులో విజయం సాధించింది. మిగిలిన వార్డుల్లో కూడా తక్కువ ఓట్ల తేడాతో పోటీ కొనసాగుతుండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన పూర్తి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం సాధించగా, సీపీఐ రెండో స్థానంలో కొనసాగుతోంది. మొదటి రౌండ్ ఫలితాల కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ప్రారంభ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే మిగిలిన వార్డుల ఫలితాలు వెలువడిన తర్వాతే తుది ఫలితాలపై స్పష్టత రానుంది. ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది


