తీర్దాల ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు
కాకతీయ,ఖమ్మం బ్యూరో: మహాశివరాత్రి సందర్భంగా జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకాంక్షించారు. ఖమ్మం రూరల్ మండలం తీర్దాల శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని తన సతీమణి మాధవితో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలకు శాంతి, సమృద్ధి కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యసేవలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడి ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ దంపతులను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంప్రసాద్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


