* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక?
* ఈ నెలాఖరున రామకృష్ణారావు పదవీ విరమణ
* చీఫ్ సెక్రటరీ నియామకంపై ప్రభుత్వo మల్లగుల్లాలు
* రేసులో నలుగురు సీనియర్ అధికారులు!
* 1992 బ్యాచ్ కు చెందిన వారికే ఛాన్స్!
* తెరపైకి అరవింద్ కుమార్, వికాస్ రాజ్, జయష్ రంజన్, సంజయ్ జాజు పేర్లు!
* సర్కార్ నిర్ణయం పై ఉద్యోగ వర్గాల్లోనూ ఉత్కంఠ
కాకతీయ తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో కొత్త సవాల్ ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్కు అత్యంత కీలకమైన పదవిగా భావించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) మార్పు అనివార్యం అయ్యింది. ప్రస్తుత సీఎస్ కే రామకృష్ణారావు పదవీ విరమణ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో ఆయన స్థానంలో కొత్త సిఎస్ ఎంపిక చేయాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పడింది. ఈ నియామకం కేవలం ఒక్క అధికారి స్థానంలో మరొకరిని కూర్చోబెట్టడంతో సరిపోదు. రాబోయే మూడేళ్ల పాటు ప్రభుత్వం పాలన దిశను, ప్రాధాన్యతలను నిర్దేశించే కీలక నిర్ణయాలను సిఎస్ తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా రాష్ట్ర పాలనను గాడిలో పెట్టడంతో పాటు ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంకట స్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టు ఎక్కించి, ఆరు గ్యారెంటీలు అమలు కోసం మార్గం సుగమం చేయాల్సిన బాధ్యత కొత్త సిఎస్ పైనే ఉంది దీంతో చీఫ్ సెక్రటరీ ఎంపికలో అధికారుల సీనియార్టీ, సామర్థ్యం విధేయత, పదవీకాలం వంటి అనేక అంశాలను ప్రభుత్వం బెరీజు వేసుకుంటుంది. కాగా.. సీనియర్ ఐఏఎస్ లు అరవింద్ కుమార్, వికాస్ రాజ్, జయష్ రంజన్, సంజయ్ జాజు పేర్లు సీఎస్ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 1992 బ్యాచ్ కు చెందిన ఈ నలుగురు కీలక అధికారుల్లో ఒకరిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.
సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి దాదాపు 20 నెలలు గడిచింది. అటు మంత్రివర్గ విస్తరణ కూడా దాదాపు జరిగిపోయింది. 6 గ్యారంటీల అమలులో బాలారిష్టాలను తొలగించుకొని ఒక్కొక్క హామీని నెమ్మదిగా అమలుపరుస్తున్నారు. అయినప్పటికీ ఇంకా అమలు కాని హామీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధతను ప్రశ్నిస్తున్నాయి. దీనికి తోడు పలు సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వాన్ని సతమతం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అధికార యంత్రాంగం సహకారం సంపూర్ణంగా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేయడం దాదాపు అసాధ్యం అలాంటి సంకట స్థితిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీ ఎంపిక అత్యంత కీలకంగా మారింది. ఈ నియామకం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనా దక్షతకు, దార్శనికతకు నిదర్శనంగా నిలవనుంది.
సీనియారిటీ లెక్కలు:
సీనియారిటీ పరంగా చూస్తే, 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అర్వింద్ కుమార్ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు తర్వాత అదే బ్యాచ్లో ఉన్న ఆయనకు సహజంగానే అవకాశం దక్కాలి. అయితే, ఆయన 2026 అక్టోబరులోనే పదవీ విరమణ చేయనున్నారు. అంటే, ఆయనను నియమిస్తే దాదాపు రెండేళ్లకే మళ్లీ కొత్త సీఎస్ కోసం వెతకాల్సిన పరిస్థితి వస్తుంది. తరచుగా సీఎస్ ను మార్చడం ప్రభుత్వ విధానాల కొనసాగింపునకు ఆటంకం కలిగిస్తుందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేవలం సీనియారిటీకే కట్టుబడుతుందా లేక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
పోటీలో 1992 బ్యాచ్ అధికారులు:
ఈ సమీకరణాల నేపథ్యంలో 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల పేర్లు బలంగా తెరపైకి వస్తున్నాయి. ఈ బ్యాచ్లో జయేష్ రంజన్, సంజయ్ జాజు, వికాస్ రాజ్ వంటి ముగ్గురు సమర్థులైన అధికారులు ఉన్నారు. వీరిలో జయేష్ రంజన్ గతంలోనూ, ప్రస్తుత ప్రభుత్వాలలో తనదైన ముద్ర వేసి, కీలక శాఖలలో పనిచేస్తూ అందరికీ సుపరిచితులుగా ఉన్నారు. ఆయనకు 2027 సెప్టెంబర్ వరకు సర్వీసు ఉంది. ఇక గతంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన వికాస్ రాజ్కు 2028 మార్చి వరకు, అంటే అందరికన్నా ఎక్కువ సర్వీసు ఉంది. రాష్ట్ర పరిపాలనపై పూర్తి పట్టున్న వీరిద్దరూ కూడా బలమైన పోటీదారులుగా ఉన్నారు.
పిలిస్తే వస్తా అంటున్న సంజయ్ జాజు:
అయితే, ఈ పోటీలో సంజయ్ జాజు పేరు ఒక ప్రత్యేకమైన ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో, సీఎస్ క్యాడర్కు సమానమైన హోదాలో పనిచేస్తున్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తే తిరిగి తెలంగాణకు వచ్చి, మరో మూడున్నరేళ్ల పాటు పూర్తిస్థాయిలో సేవలందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. పదేళ్ల పాటు ఢిల్లీలో పనిచేసిన అనుభవంతో పాటు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం సాధించడానికి ఆయనకున్న పట్టు రాష్ట్రానికి అదనపు బలంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఒకే అధికారి సీఎస్గా కొనసాగితే, ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, పరిపాలనలో స్థిరత్వం తీసుకురావడానికి వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యమంత్రి ముందున్న సవాళ్లు ఇవే:
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు అనేక ప్రశ్నలు ఉన్నాయి. కేవలం సీనియారిటీకే పట్టం కట్టి అర్వింద్ కుమార్కు అవకాశం ఇస్తారా? లేక రాష్ట్రంలో ఇప్పటికే తమ పనితీరు నిరూపించుకున్న జయేష్ రంజన్ లేదా వికాస్ రాజ్లలో ఒకరిని ఎంచుకుంటారా? వీటన్నింటికీ భిన్నంగా, దీర్ఘకాలిక స్థిరత్వం, కేంద్రంలో అనుభవం అనే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి, పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్న సంజయ్ జాజుకు బాధ్యతలు అప్పగిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం చల్తీకా నామ్ గాడీ అన్నట్లు సర్దుకుపోతుందా లేక రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించే సాహసోపేత నిర్ణయం తీసుకుంటుందా అన్నది వేచి చూడాలి.


