పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణాపై కేసులు
ఎనిమిది మందిని బైండోవర్ చేసిన పోలీసులు
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో వివిధ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎనిమిది మందిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అక్రమంగా పిడిఎస్ బియ్యం తరలిస్తున్న గంట మల్లేష్, గంట లక్ష్మణ్లను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న గన్ను రాకేష్ రెడ్డి, ఆస్తపురం విజయ్, నాగపురి అజయ్, నాగపురి రమేష్, పోలు గణేష్, బిజిలి చందును కూడా పట్టుకున్నారు.ఈ ఎనిమిది మందిని కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ఎదుట హాజరుపరచి ఒక్కొక్కరికి లక్ష రూపాయల పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో చట్టవ్యతిరేక చర్యలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు.


