ఎంపీ రఘునందన్ రావుపై ఆరోపణలు నిరాధారం
వంటేరు ప్రతాప్ రెడ్డి శిఖండి రాజకీయాలు మానుకోవాలి
ఆధారాలు లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి
సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజు డిమాండ్
కోట మైసమ్మ సాక్షిగా ప్రమాణానికి సవాల్
కాకతీయ, గజ్వేల్ : మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజు, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్ స్పష్టం చేశారు. గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎంపీపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డిని హెచ్చరించారు. ఎంపీ రఘునందన్ రావు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో గెలిచిన ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లను ఒక్కొక్కరిని కోటి రూపాయలకు కొనుగోలు చేశారన్న ఆరోపణలు పూర్తిగా ఆధారరహితమని తెలిపారు. తమ వర్గానికి చెందిన అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ కాలేదనే అక్కసుతో ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వంటేరు ప్రతాప్ రెడ్డి గత రాజకీయ ప్రయాణంపై కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, ఆ సమయంలో జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. గజ్వేల్లో కేసీఆర్ను ఓడించేందుకు డబ్బు సంచుల రాజకీయాలపై ముందుగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. హరీష్రావు డబ్బులు ఇస్తానన్న వ్యాఖ్యలపై కోట మైసమ్మ ఆలయం వద్ద ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఫామ్హౌస్ల నుంచి డబ్బు సంచులు తెచ్చి అభ్యర్థులకు పంపిణీ చేశారన్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు హెచ్చరించారు. శిఖండి రాజకీయాలు మానుకొని ప్రజల ముందు నిజాయితీగా వ్యవహరించాలని సూచించారు. లేనిపక్షంలో గజ్వేల్ ప్రజలే తగిన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, టెలికాం బోర్డు సభ్యుడు కమ్మరి శ్రీనివాస్, అసెంబ్లీ కో-కన్వీనర్ ఎల్కంటి సురేష్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నత్తి శివకుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు చెప్యాల వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి నాయిని సందీప్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


