పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహించితే చర్యలు తప్పవు!
చెత్త వాహనాలకు జీపీఎస్, ఫ్యూయల్ సెన్సార్లు తప్పనిసరి
పన్ను ఎగవేతదారులపై ఆర్ఆర్ యాక్ట్ అమలు
అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు నెలలో పూర్తి చేయాలి
పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కఠిన ఆదేశాలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నగరపాలక సంస్థ విధులను సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పనితీరుపై శుక్రవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కొంతమేర ఫలితాలు ఇచ్చిందని, మరోసారి సమగ్ర ప్రణాళికతో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. చెత్త రవాణా వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్, ఫ్యూయల్ సెన్సార్లు అమర్చాలని, వాటి కదలికలను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరుకు ఎఫ్.ఆర్.ఎస్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా నగరంలో కనీసం వెయ్యి ఖాళీ స్థలాలను గుర్తించి, అక్కడి పిచ్చి మొక్కలు తొలగించి చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మీడియన్లు, ప్రధాన రహదారుల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దుమ్ము సమస్య లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతి లేని హోర్డింగులు, పోస్టర్లు వెంటనే తొలగించాలని, మళ్లీ అతికిస్తే భారీ జరిమానాలు విధించి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
పనులు వంద శాతం పూర్తవ్వాలి
నగరంలో మంజూరైన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వంద శాతం గ్రౌండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నాణ్యతతో పనులు వేగంగా పూర్తిచేయాలని, పర్యవేక్షణకు ప్రత్యేక డాష్బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫుట్పాత్ పనులు మార్చి మొదటి వారంలోగా పూర్తిచేయాలని, అభివృద్ధి పనులపై ప్రతి వారం నివేదిక అందించాలని ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూలు కేవలం 32 శాతమే ఉందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నోటీసులు ఇచ్చినా పన్ను చెల్లించని భవనాలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుని సీజ్ చేయాలని స్పష్టం చేశారు. డిఫాల్టర్ల నీటి సరఫరా నిలిపివేయాలని, వాణిజ్య భవనాల పన్ను బకాయిలు వసూలు చేయకపోతే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. పన్ను చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. నగరంలోని పార్కులు, మీడియన్లలో పచ్చదనం పరిరక్షణకు వాటరింగ్ షెడ్యూల్ రూపొందించాలని, డ్రిప్ విధానంలో నీటి సరఫరా చేయాలని చెప్పారు. ఫుట్పాత్ ఆక్రమణలను అనుమతించవద్దని, అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అమృత్ 2.0 పథకంలో చేపట్టిన తాగునీటి పనులు సకాలంలో పూర్తి చేయాలని, విద్యుత్ బిల్లులు తగ్గేలా మోటార్ల మరమ్మతులు మూడు వారాల్లో పూర్తిచేయాలని సూచించారు. నగరంలో పెండింగ్లో ఉన్న 1.6 కిలోమీటర్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను అదనపు సిబ్బందితో నాలుగు వారాల్లో ముగించాలని గడువు విధించారు. వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, షెల్టర్ ఏర్పాటుచేసి నగరానికి దూరంగా తరలించాలని తెలిపారు. వీధుల్లో కుక్కలకు ఆహారం పెట్టకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడా చీకటి ప్రాంతాలు ఉండకుండా పూర్తి స్థాయిలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, సహాయ కమిషనర్ అనిల్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.


