విద్యలో విప్లవానికి శ్రీకారం!
“ప్రభుత్వ బడిలో చదవడం మా అదృష్టం” అనిపించేలా మార్పులు
విద్యారంగంపై ప్రత్యేక దృష్టి… భారీ నిధుల కేటాయింపు
అత్యాధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణం
రాష్ట్రవ్యాప్తంగా 100 ‘యంగ్ ఇండియా’ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు
పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి
విద్యార్థులు సమాజానికి మార్గదర్శకులుగా ఎదగాలని పిలుపు
కాకతీయ, బోనకల్ : “భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో చదవడం మా అదృష్టం అని విద్యార్థులు గర్వంగా చెప్పుకునే విధంగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతాం” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలోని తేళ్ల వసంతయ్య స్మారక టీవీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం 48వ వార్షిక సమ్మేళనానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల 48వ వార్షిక సంచికను ఆవిష్కరించి, విద్యా రంగంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు కేవలం విద్యాబోధన జరిగే స్థలాలు మాత్రమే కాకుండా, భవిష్యత్ భారత నిర్మాణానికి పునాదులు వేసే విజ్ఞాన కేంద్రాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నాణ్యమైన విద్య అందించడం ద్వారా సమాజంలో సమూల మార్పులు తీసుకురావచ్చని ఆయన తెలిపారు.
అత్యాధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
ప్రజా ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. పాఠశాల భవనాల మరమ్మతులు, కొత్త తరగతి గదుల నిర్మాణం, డిజిటల్ విద్యా విధానం అమలు, తాగునీటి సౌకర్యం, బాలికలకు ప్రత్యేక వసతులు, లైబ్రరీలు వంటి సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ స్థాయిలో ‘యంగ్ ఇండియా’ స్కూల్స్
తెలంగాణ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా రాష్ట్రవ్యాప్తంగా 100 ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ ఏర్పాటు చేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. అత్యాధునిక సౌకర్యాలు, నాణ్యమైన బోధనతో ఈ పాఠశాలలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతాయని తెలిపారు. నాణ్యమైన విద్య ద్వారానే రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం సాధ్యమవుతుందని, అందుకే విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “మీరు ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన పాఠశాలకు, సమాజానికి తిరిగి ఏమి చేయగలరో ఆలోచించాలి” అని పిలుపునిచ్చారు. తమ అనుభవాలను పుస్తక రూపంలో తీసుకువచ్చి నేటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. విద్యార్థులను భావి భారత మార్గదర్శకులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడం మాత్రమే కాకుండా, విద్యార్థుల్లో విలువలు, సంస్కారం, బాధ్యతాభావాన్ని పెంపొందించాలని సూచించారు. పాఠశాల దశలోనే నైతిక విలువలు బలపడితేనే భవిష్యత్తులో సమాజానికి మార్గదర్శకులుగా ఎదగగలరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.


