పేరుకే మున్సిపాలిటీ…
దశాబ్దాలుగా ఎన్నికలే లేని మణుగూరు!
మున్సిపాలిటీగా ఉన్నా ప్రజాస్వామ్యం దూరం
ప్రజాప్రతినిధుల్లేని పాలనతో ఇబ్బందులు
కోర్టు కేసులే ప్రధాన అడ్డంకి… కుంటుపడుతున్న అభివృద్ధి
కాకతీయ, మణుగూరు టౌన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణం గత ఇరవై ఏళ్లుగా ఎన్నికలు లేకుండానే కొనసాగుతోంది. 2004–05లో మున్సిపాలిటీగా ప్రకటించినా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎన్నికలు జరగకపోవడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే ప్రజా ప్రతినిధులే లేకపోవడంతో పరిపాలనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి కౌన్సిల్ వ్యవస్థ లేకుండానే అధికారుల ఆధ్వర్యంలో పాలన కొనసాగుతోంది. వార్డు సభ్యులు, చైర్మన్, కౌన్సిలర్లు లేకపోవడంతో ప్రజలకు నేరుగా తమ సమస్యలు వినిపించే వేదిక లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ఫలితంగా చిన్న సమస్యలకే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, మణుగూరుకు మాత్రం ఇప్పటికీ మినహాయింపు కొనసాగుతోంది. సమీపంలోని భద్రాచలంలో కూడా కోర్టు కేసుల కారణంగా ఏళ్ల తరబడి ఎన్నికలు జరగకపోయినా, ఇటీవల న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించారు. భద్రాచలానికి సాధ్యమైన ఎన్నికలు మణుగూరుకు ఎందుకు సాధ్యం కావడం లేదన్న ప్రశ్న ప్రజల్లో తీవ్రంగా వినిపిస్తోంది.
హైకోర్టు కేసులతో నిలిచిన వ్యవస్థ
మణుగూరు మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ ప్రాంతం షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి వస్తుందని, అందువల్ల మున్సిపాలిటీ చట్టం ఇక్కడ వర్తించదని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ న్యాయపరమైన వివాదాల కారణంగా ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. మున్సిపాలిటీని రద్దు చేయలేదు, పంచాయతీగా కూడా మార్చలేదు. ఎన్నికలు మాత్రం నిర్వహించడం లేదు. ఫలితంగా మణుగూరు పట్టణం పరిపాలనా పరంగా మధ్యలోనే నిలిచిపోయిన ప్రాంతంగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. 1/70 యాక్ట్ వర్తింపుపై స్పష్టత లేకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది.
పేరుకుపోతున్న సమస్యలు
ఎన్నికలు లేకపోవడం వల్ల పట్టణంలో అనేక పరిపాలనా సమస్యలు పేరుకుపోతున్నాయి. ఇళ్ల నంబర్లు నవీకరించకపోవడం, ఆస్తుల రికార్డులు సరిచేయకపోవడం వంటి ఇబ్బందులు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. మరణించిన వ్యక్తుల పేర్లతోనే ఇప్పటికీ రికార్డులు కొనసాగుతుండటంతో వారసులకు హక్కులు దక్కడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికైన పాలకమండలి లేకపోవడంతో బాధ్యత తీసుకునే ప్రజాప్రతినిధులు లేరని, అధికారులపై జవాబుదారీతనం తగ్గిపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల పట్టణం వెనుకబడుతోందని అంటున్నారు. ఎన్నికలు లేకపోతే పట్టణాభివృద్ధి ఎలా సాధ్యమని మణుగూరు వాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయాలన్నా, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్నా ఎన్నికైన ప్రతినిధులే అవసరమని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు లేకపోవడం వల్ల అవినీతి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మణుగూరు ప్రజలు అధికారం కోరడం లేదని, తమ ప్రజాస్వామ్య హక్కు మాత్రమే కోరుతున్నామని తేల్చి చెబుతున్నారు. కోర్టు కేసులను త్వరగా పరిష్కరించి మున్సిపాలిటీగా కొనసాగిస్తే వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే పంచాయతీగా మార్చి అయినా ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పష్టమైన నిర్ణయం తీసుకుని మణుగూరుకు ఎన్నికల మార్గం సుగమం చేయాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు.


