రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం!
అపర భగీరథుడిలా రాంరెడ్డి గోపాల్ రెడ్డి సాహసం
కాకతీయ, కామేపల్లి: ఇల్లందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలం నెమలిపురి గ్రామంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదం పెద్ద విషాదానికి దారి తీసే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. లోపల ఉన్న కుటుంబ సభ్యులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు రాంరెడ్డి గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి జగన్నాథ్ రెడ్డి, గ్రామ నాయకులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. మంటల తీవ్రత మధ్య స్వయంగా రంగంలోకి దిగి నియంత్రించే ప్రయత్నం చేశారు. ఇంట్లో దాచిన ఐదు లక్షల రూపాయల నగదు మంటల్లో కాలిపోకుండా ప్రాణాలకు తెగించి బయటకు తీయించి బాధితులకు అందజేశారు. పక్క ఇళ్లకు మంటలు వ్యాపించకుండా అప్రమత్తం చేసి పెను నష్టాన్ని తప్పించారు. సమయస్ఫూర్తితో స్పందించిన నాయకులను గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


