కరకగూడెం అడవుల్లో పెద్దపులి సంచారం
పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు
రఘునాథపాలెం, జానంపేట పరిసరాల్లో అప్రమత్తం
ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు
గిరిజనులు, రైతులు అడవికి వెళ్లవద్దని హెచ్చరిక
కాకతీయ, మణుగూరు/కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రఘునాథపాలెం, జానంపేట–పొట్లపల్లి పరిసర అడవులతో పాటు రాళ్లవాగు ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు రైతులు, గిరిజనులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గత రెండు రోజులుగా వ్యవసాయ పొలాల సమీపంలో పులి కదలికలు కనిపిస్తున్నాయని, పెద్దపులి అరుపులు వినిపిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు, గిరిజనులు అడవిలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు.

పాదముద్రల ఆధారంగా గాలింపు
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అడవిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి పులి పాదముద్రలను గుర్తించారు. పులి కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిఘా కోసం అడవిలోని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులి సంచార మార్గాన్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతం నుంచి ఈ పులి కరకగూడెం అడవుల్లోకి ప్రవేశించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పులి సంచారంతో అటవీ అంచున ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రైతులు, పశువుల కాపరులు అడవిలోకి ఒంటరిగా వెళ్లవద్దని, రాత్రి సమయాల్లో బయటకు రావడాన్ని నివారించాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. పశువులను కూడా అడవికి సమీప ప్రాంతాల్లో మేపవద్దని సూచించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.


