- వీకే కోల్ మైన్ ను సందర్శించిన డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: రక్షణ సూత్రాలను పాటిస్తూ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని సింగరేణి డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్)కొప్పుల వెంకటేశ్వర్లు సూచించారు. కొత్తగూడెం ఏరియాలోని వీకే కోల్ మైన్ ను ఆదివారం ఆయన సందర్శించి మైన్ వ్యూ పాయింట్ నుండి ఓపెన్ క్యాస్ట్ లో జరుగుతున్న మట్టి తొలగింపు పనులను పరిశీలించారు. అనంతరం మట్టి తొలగింపు పనులు చేపడుతున్న కాంట్రాక్టర్కు అనుకున్న సమయంలోగా బొగ్గు ఉత్పత్తి కొరకు కావలసిన మట్టి తొలగింపు పనులను పూర్తి చేసుకోవాలని, అలాగే ఓబీ డంపులలో హాలర్ రోడ్ పై తగు రక్షణ సూత్రాలను పాటిస్తూ పనులను చేయాలని అధికారులను ఆదేశించారు. వీకే కోల్ మైన్ కోల్ డిస్పాచ్ ఏర్పాట్లు, ప్రస్తుత స్థితిని సమీక్షించారు. కొత్తగూడెం ఏరియా ఉత్పత్తి డిస్పాచ్ వివరాలను ఏరియా జీఎం షాలేం రాజు వివరించారు. కార్యక్రమంలో వీకే కోల్ మైన్స్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.శ్రీ రమేష్, మేనేజర్ రామచంద్ర మురళి, శోధ ఓబీ కాంట్రాక్ట్ మేనేజర్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.


