- ఖరీఫ్ లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు లక్ష్యం
- పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు

కాకతీయ, విజయవాడ: భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, లావు శ్రీ కృష్ణ దేవరాయలు రాష్ట్రం లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో భారత ప్రభుత్వం ద్వారా 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు. నగరంలోని పటమట యనమలకుదురు రోడ్డులోని భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, లావు శ్రీ కృష్ణ దేవరాయలు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ లావు శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రికేయులతో మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రైతుకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత ఏడాది ఖరీఫ్ లో 15.92 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ ద్వారా కొనుగోలు చేసామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. ఎఫ్ సీఐ నుంచి పంజాబ్ రాష్ట్రం తర్వాత 14 లక్షల టన్నుల బియ్యాన్ని 10 % బ్రోకెన్ తో సేకరించడానికి అనుమతి ఉన్న రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.

గత అనుభవాల ధృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ధాన్యం కొనుగోలు పెంచాలని కోరటం జరిగిందని, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని పెంచిందన్నారు. గత రబీ సీజ్ లో 9.93 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది రబీలో కొనుగోలు లక్ష్యాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో సోలార్ విద్యుత్ కు 45 మెగా వాట్స్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ప్లానెల్స్ పెట్టుకోగల అవకాశం కలిగి ఉందని వివరించారు. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ: భారత ఆహార సంస్థ ద్వారా ప్రతి నెలా 1.54 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ అవుతుందన్నారు.
ఫోర్టిఫైడ్ రైస్ ను రాష్ట్రంలో 24.47 లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం క్రింద, మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని 55,746 అంగన్వాడీ కేంద్రాలకు ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర (MSP) ప్రయోజనం కల్పించేలా, ప్రజలకు ప్రజా పంపిణీ వ్వవస్థ ద్వారా ప్రయోజనం చేకూర్చే విధంగాను సమీక్షించారు. కమిటీ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, భారత ఆహార సంస్థ ఏపీ రీజనల్ జనరల్ మేనేజర్ విజయ కుమార్ యాదవ్, సివిల్ సప్లైస్ అధికారులు, భారత ఆహార సంస్థ అధికారులు, భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ సభ్యులు, తదితరలు పాల్గొన్నారు.


