- సోమవారం నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్
- ఖాళీ స్థలాల శుభ్రతకు యజమానులకు నోటీసులివ్వండి
- ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
- పారిశుద్ధ్య నిర్వహణపై మునిసిపల్ అధికారులతో సమీక్ష
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. శుక్రవారం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం నగరంలో మరింత మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టేందుకు సోమవారం (అక్టోబర్ 13) నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ 10 రోజుల పాటు చేపట్టడం జరుగుతుందని అన్నారు. నగర వ్యాప్తంగా పేరుకు పోయిన చెత్తను శుభ్రం చేయాలని, మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జవాన్ నుంచి సహాయ కమిషనర్ వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని అన్నారు. చెత్త తో ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసిన తర్వాత ముందు, ఆ తరువాత తేడాను తెలియజేసేలా ఫోటోలు తీయాలని, ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన అదనపు లేబర్, ఎక్విప్మెంట్ అందుబాటులో పెట్టడం జరుగుతుందని అన్నారు. నగరంలోని ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లలో ఎక్కడ చెత్త ఉండకుండా శుభ్రం చేయాలని, వర్షాల వల్ల పేరుకుపోయిన మట్టి తొలగించాలని అన్నారు. జవాన్ వారీగా రోజుకు ఏ ప్రాంతంలో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు శుభ్రం చేస్తున్నారు తెలియజేసేలా ప్రొఫార్మా తయారు చేయాలని అన్నారు.
సెలవులు రద్దు చేయండి..
ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ సందర్భంగా శానిటేషన్ జవాన్, సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు జవాన్ తన పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు ఉదయం సకాలంలో రిపోర్ట్ చేసేలా చూడాలని, అందరికంటే ముందే జవాన్ వచ్చి ఫీల్డ్ లో ఉండాలని, వార్డు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా ఉన్న డ్రైయిన్ పూడిక తీత పనులు చేపట్టాలని అన్నారు. ఏ రోజు తీసిన పూడికతీత అదే రోజు అక్కడి నుంచి తొలగించేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. పబ్లిక్ పార్క్, బస్ స్టాప్స్, పబ్లిక్ టాయిలెట్స్ పూర్తిగా శుభ్రం చేయాలని అన్నారు. నగరంలో ఉన్న ఖాళీ స్థలాలను 100 శాతం శుభ్రం చేయాలని, అక్కడ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించాలని అన్నారు. ప్రైవేట్ ఖాళీ స్థలాలు శుభ్రం చేసుకునేలా యజమానులకు నోటిసులు జారీ చేయాలని అన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమీషనర్ అనిల్ కుమార్, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు,
సూపర్వైజర్, జవాన్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


