కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాజమండ్రి- తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసును ఢిల్లీ నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు , రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి లు వర్చువల్ గా ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ సంస్థ ఆధ్వర్యంలో వారానికి మూడు రోజులు(మంగళ, గురు, శనివారాలు) రాజమండ్రి నుండి తిరుపతి మధ్య ఈ విమాన సర్వీసులు నడవనున్నాయనీ తెలిపారు.
ఉదయం 7:40 గంటలకు తిరుపతిలో బయలుదేరి 9.25 గంటలకు రాజమండ్రి చేరుకుని.. ఉదయం 9.50 గంటలకు రాజమండ్రి లో బయలుదేరి ఉదయం 11.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ విమాన సర్వీసు ప్రారంభంతో రాజమండ్రి తిరుపతి మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. డిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ అర్బన్, రాజానగరం ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బల రామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. “నవరాత్రుల సందర్భంగా రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసు ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇది రాజమండ్రి వాసులకు ఓ మంచి కానుక. గతంలో కూడా రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఢిల్లీ, ముంబై కి కూడా విమాన సర్వీసులు గతంలోనే ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పుడు అవి దేశంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న ఎయిర్ సర్వీసులుగా నిలిచాయన్నారు. అవి ఇప్పుడు ఫుల్ అక్కూపన్సీ నడుస్తున్నాయన్నారు.
రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు ఎంత సామర్థ్యం ఉందో ఇటువంటి వాటి వల్ల తెలుస్తోందన్నారు. ఉభయ గోదావరి జిల్లా వాసులందరికీ సాంస్కృతిక రాజధాని రాజమండ్రి నుండి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి విమాన సర్వీసు ప్రారంభించడం ఒక కానుక గా ఆయన అభివర్ణించారు. రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన టికెట్లు మొదలు పెట్టగానే వెంటనే టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయి. డిమాండ్ ఉన్న మార్గాల్లో టికెట్లు రేట్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజమండ్రి నుంచి తిరుపతి వరకు నడిచే విమాన సర్వీసులో మూడు నెలలపాటు మొదటి 35 సీట్లు 1999 రూపాయలు , తర్వాత 35 సీట్లు 4000 రూపాయలకే అందించడం జరుగు తుందన్నారు.
రాజమండ్రి ఎయిర్పోర్టులో 2వ టెర్మినల్ కూడా నూతనంగా నిర్మిస్తున్నాం , పనులు చురుగ్గా సాగుతున్నాయని త్వరలోనే అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని పేర్కొన్నారు. రాజమండ్రి నుంచి షిరిడి గోవా అహ్మదాబాద్ వారణాసి ఇతర ప్రాంతాలకు కూడా ఎయిర్ సర్వీసులు ప్రారంభించాలని ప్రజా ప్రతినిధులు ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో వాటిని కూడా ప్రారంభించ డానికి ప్రయత్నం చేస్తాం అని హామీ ఇచ్చారు. బెంగళూరుకు ఇప్పటికే ఒక ఎయిర్ సర్వీసు నడుస్తోందనీ, వీటికి అదనంగా వేరొక సర్వీస్ ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అని తెలియ చేశారు. రాజమండ్రి నుంచి ఏ ప్రాంతానికి విమాన సర్వీసులు మొదలుపెట్టిన 100 శాతం ఆక్యుపెన్సితో నడుస్తున్నాయనీ, ఇది చాలా సంతోషించ తగ్గ పరిణామం అన్నారు. గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో రాజమండ్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ” అని అన్నారు.
రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ…” రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసు..రాజమండ్రి ప్రాంత వాసుల చిరకాల కోరిక. ఆ కోరికను కార్యరూపం దాల్చేలా చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి కి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపినట్టు రాజమండ్రి నుంచి తిరుపతికి వెళ్లే విమానంలో మొదటి మూడు నెలలపాటు మొదటి 35 మందికి రూ.1999 లకు, తరువాత 35 మందికి రూ.4000 లకు విమాన సర్వీసు అందించడం చాలా మందికి ఉపయోగం పడుతుందని తెలిపారు. విమాన చార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం అందులోనూ ఎయిర్ కనెక్టివిటీ ఎంతో ముఖ్యం అన్నారు. రాజమండ్రి నుంచి ఎయిర్ కనెక్టివిటీ పెరుగుదలకు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, దేశ వ్యాప్తంగా విమాన సర్వీసుల ద్వారా వివిధ రాష్ట్రాలకు అనుసంధానిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు ” అని అన్నారు.
రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ “రాజమండ్రి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలు ఎప్పటినుంచో తిరుపతికి ఒక విమాన సర్వీసు ఉండాలని కోరుకున్నారనీ , వారి కోరిక మేరకు తిరుపతికి ఈరోజు విమాన సర్వీసు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రాజమండ్రి నుంచి తిరుపతికి వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకురాగానే రెండు మూడు నెలలు గడువు ఇవ్వండి అని అడిగి అలయన్స్ సంస్థతో మాట్లాడి ఈరోజు విమాన సర్వీసును ఏర్పాటు చేశారన్నారు. రాజమండ్రి ప్రజలు ప్రజాప్రతినిధుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియ చేస్తూ ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాల కల్పన ఎంతో అవసరం అన్నారు. రోడ్లు రైలు మార్గాలతో పాటు ఇప్పుడు విమాన సర్వీసులు ప్రారంభించడం రాజమండ్రి ప్రాంత మరింత అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రిని దేశంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధారణించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనీ , దీనితో రాజమండ్రి లో పర్యాటక అభివృద్ధి చెందు తుందన్నారు. ఇంతకు ముందే న్యూఢిల్లీకి కూడా ఒక విమాన సర్వీసును ప్రారంభించుకున్నాం” అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసు ప్రారంభించడం చాలా సంతోషం ఇది ఈ ప్రాంత వాసులుగా ఎంతగానో ఉపయోగపడుతుందనీ , రాజమండ్రి నుంచి షిరిడి, గోవా, అహ్మదాబాద్, వారణాసి, కొచ్చిన్ లకు కూడా విమాన సర్వీసులు ప్రారంభించాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి తదితరులు కోరారు. అనంతరం రాజమండ్రి నుంచి తిరుపతికు బయలు దేరిన విమాన సర్వీసును జెండా ఊపి మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.
కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ,రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ , రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కె.యన్. శ్రీకాంత్, అలయన్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


