కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల సెప్టెంబర్ 29, అక్టోబర్ 1 తేదీల్లో విచారణ జరగనుందని స్పీకర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ కేసులో పిటిషనర్లుగా బీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. వీరు స్పీకర్కు ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రతివాదులుగా కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలైన టి. ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, గుడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ విచారణలో ఇరువర్గాల వాదనలు వినిపించనున్నారు. సెప్టెంబర్ 29న ఉదయం 11గంటలకు ఈ విచారణలు ప్రారంభం అవుతాయి. అదే రోజు మధ్యాహ్నం 12గంటలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విచారణ, మధ్యాహ్నం ఒంటిగంటకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విచారణ, మధ్యాహ్నం 3గంటలకు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి విచారణ ఉండనుంది.

అయితే అనర్హత పిటిషన్లపై ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఈ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్ దశలో న్యాయవాదులు కీలక వాదనలు వినిపించనున్నారు. అక్టోబర్ 1న మరోసారి అదే కేసులపై విచారణలు కొనసాగుతాయి. పిటిషనర్లు, ప్రతివాదులు తరపున న్యాయవాదులు ప్రత్యక్ష వాదనలు వినిపిస్తారు. స్పీకర్ ఆధ్వర్యంలో 10వ షెడ్యూల్ ప్రకారం ఈ విచారణ జరపనున్నారు.
బీఆర్ఎస్ న్యాయవాదులు Vs పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు
కల్వకుంట్ల సంజయ్ vs T. ప్రకాశ్ గౌడ్
చింత ప్రభాకర్ vs కేల యాదయ్య
చింత ప్రభాకర్ vs గుడెం మహిపాల్ రెడ్డి
పల్లా రాజేశ్వర్ రెడ్డి vs బండ్ల కృష్ణమోహన్ రెడ్డి


