మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
6వ డివిజన్లో రూ. కోటి 46 లక్షలతో పనులు
కాకతీయ, ఖమ్మం : విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 6వ డివిజన్లో రూ. కోటి 46 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… నగర కార్పొరేషన్ లో విలీనమైన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం త్వరితగతిన జరుగుతుందని, దీనికి అనుగుణంగా కొత్త రోడ్లు, డ్రైయిన్లు నిర్మిస్తున్నామని తెలిపారు.
6వ డివిజన్ పరిధిలో పూర్తి స్థాయిలో రోడ్డు డ్రైన్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అన్నారు. నగరంలో ఖాళీ స్థలాల యజమానులు బాధ్యత తీసుకొని వారి స్థలం నుంచి దుర్వాసన, దోమలు రాకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా భూమి లెవెలింగ్ చేయాలని, లేని పక్షంలో కార్పొరేషన్ తరపున చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి ఇంటిలో ఇంకుడుగుంతల నిర్మాణం చేసుకోవాలని తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. నగరంలో జరిగే నూతన నిర్మాణాలను ప్రారంభ దశలోనే సక్రమంగా ఉన్నాయో లేవో టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించాలని, రోడ్లను ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ జరిగే నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని మంత్రి ఆదేశించారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, 6వ డివిజన్ కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబు, మునిసిపల్ కార్పొరేషన్ ఈఈ కృష్ణలాల్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


