బాధితుల వద్దే ఎఫ్ఐఆర్ నమోదు సేవలు
డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్తో పోలీసుల వినూత్న చర్య
కాకతీయ, తుంగతుర్తి: బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్ సేవలు అందిస్తున్నామని ఎస్సై క్రాంతి తెలిపారు. సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి బాధితుల వద్దనే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. మంగళవారం జరిగిన ప్రమాదంలో పర్శాయిపల్లి గ్రామానికి చెందిన వీరాస్వామి ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో తుంగతుర్తి పోలీసులు హైదరాబాద్లోనే ఆసుపత్రి వద్ద మృతుని బంధువుల నుంచి ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై క్రాంతి మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్ కార్యక్రమం బాధితులకు ఎంతో ఉపయుక్తంగా మారుతుందని తెలిపారు. బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి ఎఫ్ఐఆర్ కాపీలు అందజేయడం ద్వారా పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. ఈ విధానం వల్ల పోలీస్ స్టేషన్లకు వెళ్లే ఇబ్బంది లేకుండా సత్వర న్యాయం అందించగలుగుతున్నామని తెలిపారు.


