ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సోమవారం ఆకస్మికంగా పరీక్షా కేంద్రాలను సందర్శించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ కళాశాల మరియు భగత్నగర్లోని అల్ఫోర్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షా హాళ్లలో సీసీ కెమెరాల పనితీరు, విద్యార్థుల హాజరు నమోదు విధానం, హాల్ టికెట్ల పరిశీలన, ప్రశ్నపత్రాల భద్రత, పోలీసు బందోబస్తు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్కు ఎలాంటి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, విద్యుత్, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని సూచించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.


