అనుమతి అక్కడ.. నిర్వహణ ఇక్కడ!
శంకరపట్నం వారసంత రోడ్డుపై ఏర్పాటు
జాతీయ రహదారిపై ప్రమాదాలకు ఆహ్వానం
పట్టించుకోని అధికారులు, ప్రజల ఆగ్రహం
కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో ప్రతి సోమవారం జరిగే వారసంత స్థానికులకు సమస్యగా మారింది. మార్కెట్ యార్డు బస్టాండ్ వెనుక అనుమతి ఉన్నప్పటికీ, సంతను వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారి పక్కన, కేశవపట్నం బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం చుట్టూ నిర్వహిస్తున్నారు.మండలంలోని పలు గ్రామాల నుంచి రైతులు, వ్యాపారులు కూరగాయలు, బట్టలు, నిత్యావసర సరుకులు తెచ్చి అమ్ముతుంటారు. వందల సంఖ్యలో వినియోగదారులు కొనుగోలు కోసం తరలివస్తారు. అయితే రోడ్డుకి ఇరువైపులా దుకాణాలు పెట్టడం వల్ల ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. నిత్యం వేల సంఖ్యలో ప్రజలు బస్టాండ్ నుంచి ప్రయాణిస్తుండగా, జాతీయ రహదారి పక్కనే సంత ఏర్పాటు చేయడం ప్రమాదాలకు దారితీస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాల తర్వాతా స్పందన లేదు
ఇటీవల బస్టాండ్ ఎదురుగా బస్సులు ఢీకొని ప్రమాదాలు జరిగిన ఘటనలు చోటుచేసుకున్నా, సంబంధిత శాఖలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు సిబ్బంది కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా రోడ్డుపై దుకాణాలు పెడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వెంటనే సంతను అనుమతి ఉన్న ప్రదేశంలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, రోడ్డుకి ఇరువైపులా దుకాణాలు పెట్టనీయకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


