వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే
21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే
ఖమ్మం జిల్లాకు చెందినవారు 522 మంది గుర్తింపు
ఇతర జిల్లాల వారు 107… ఇతర రాష్ట్రాల వారు ముగ్గురు
అర్హుల జాబితా తర్వాత స్థల పట్టాలు, ఇళ్లు
సంబంధితులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలి
అర్హులైన వారికి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు
: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో ఫిబ్రవరి 24న భూదాన్ భూముల్లో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోయిన వ్యక్తుల సామాజిక, ఆర్థిక సర్వే ముమ్మరంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బాధితుల వివరాలను సమగ్రంగా సేకరించి అర్హులను గుర్తించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లాలోని 21 మంది తహశీల్దార్లకు సర్వే బాధ్యతలు అప్పగించామని, సంబంధిత వ్యక్తుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన వారు 182 మంది, ఖమ్మం జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన వారు 340 మంది ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా ఖమ్మం జిల్లాకు చెందిన వారు 522 మంది గుర్తించబడ్డారని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన వారు 107 మంది ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ముగ్గురు ఉన్నట్లు ప్రాథమిక సర్వేలో తేలిందని చెప్పారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, మరికొంత మంది వివరాలు నమోదు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
అర్హులకు ఇళ్లు
సర్వే పూర్తైన తర్వాత అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నివాస స్థల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎవరికీ అన్యాయం జరగకుండా పారదర్శకంగా సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హత ప్రమాణాల ప్రకారం మాత్రమే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. సర్వే ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా సంబంధిత వ్యక్తులు తమ గ్రామాల్లో అందుబాటులో ఉండి అధికారులకు అవసరమైన వివరాలు అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సామాజిక, ఆర్థిక సర్వేకు సహకరించడం ద్వారా అర్హుల గుర్తింపు సులభమవుతుందని తెలిపారు. వెలుగుమట్ల ఘటనలో ఇండ్లు కోల్పోయిన వారికి న్యాయం చేయడమే లక్ష్యమని, ప్రభుత్వం అర్హులైన పేదల పక్షాన నిలుస్తుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు.


