కాంగ్రెస్ విష ప్రచారం నమ్మొద్దు
సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్
కాకతీయ, రామకృష్ణాపూర్ : కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను, విష ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మొద్దని, ఆ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా సీపీఐ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ సూచించారు. మంత్రి హోదాలో ఉండి సీపీఐ, బీఆర్ఎస్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ పుకార్లు సృష్టించడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టని విమర్శించారు. ప్రజాతీర్పును గౌరవించకుండా సీపీఐ, బీఆర్ఎస్ మధ్య మంత్రి చిచ్చుపెట్టే వ్యాఖ్యలు మానుకోవాలని పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. ఎన్నికల పొత్తులో భాగంగానే సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి డాక్టర్ రాజా రమేష్ సతీమణి డాక్టర్ సంధ్యారాణిని చైర్ పర్సన్ అభ్యర్థురాలుగా అధికారికంగా ప్రకటించి, ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేసినట్లుగా గుర్తు చేశారు. సీపీఐ సిద్ధాంతాలకు, పొత్తు ధర్మానికి కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని, మంత్రి వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు నిబద్ధత, నిజాయితీ ఉంటే క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నిక సమయంలో జరిగిన ఘటనలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి పౌల్, కామెర దుర్గారాజ్, వనం సత్యనారాయణ, కాదండి సాంబయ్య, నక్క వెంకటస్వామి, మొండి, గోపి, గాజుల మణెమ్మ, రోడ్డ తిరుమల తదితరులు పాల్గొన్నారు.


