ఇదేనా ఇందిరమ్మ రాజ్యం…?!
పేదల ఇళ్లపై బుల్డోజర్ రాజకీయం!
పట్టాలు ఉన్నా ఇళ్లను ఎందుకు కూల్చారు?
పేదలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి
వెలుగుమట్లలో కూల్చివేతలు ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనం
ఏ ఇంటిని ముట్టుకున్న పేదోళ్ల కన్నీటి కథలే
భూదాన్ బాధితులకు అండగా బీఆర్ఎస్
శాసనసభ నుంచి సుప్రీంకోర్టు దాకా పోరాటం చేస్తాం
వచ్చే మా ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరికి ఇక్కడే ఇళ్లు కట్టిస్తాం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాకతీయ, ఖమ్మం బ్యూరో : “వెలుగుమట్లలో నేను చూసింది హృదయాన్ని కలచివేసే దృశ్యం. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని నేను అడుగుతున్నాను. పట్టాలు ఉన్న పేదల ఇళ్లపై బుల్డోజర్ నడపటమేనా పాలన? పేదల ఇళ్లను కూల్చడానికి ఈ ప్రభుత్వానికి ఏ హక్కు ఉంది? పట్టాలు ఉన్నా ఇళ్లను ఎందుకు కూల్చారు? దీనికి ఈ ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పాలి” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. “ఇదేనా ఇందిరమ్మ రాజ్యం…? పట్టాలు ఉన్న పేదల ఇళ్లపై బుల్డోజర్ నడపటమేనా పాలన? పేదల ఇళ్లను కూల్చడానికి ఈ ప్రభుత్వానికి ఏ హక్కు ఉంది?” అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న పేదల ఇళ్లను కూల్చివేతను ఆయన ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనంగా అభివర్ణించారు. గురువారం ఖమ్మం జిల్లా వెలుగుమట్లకు చేరుకున్న బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా నాయకులు, మాజీమంత్రి పువ్వాడ అజయ్, ముఖ్య నేతలతో కలిసి బాధితులను పరామర్శించారు. ఈసందర్భంగా కేటీఆర్బా ధితులను పరామర్శించిన కల్వకుంట్ల తారక రామారావు, భూదాన్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

అనుమతులిచ్చి కూల్చివేయడం అమానుషం..!
“నేను ప్రతి ఇంటి ముందు నిలబడి బాధితుల మాటలు విన్నాను. వారి చేతుల్లో పట్టాలు ఉన్నాయి. భూదాన్ భూముల కేటాయింపు పత్రాలు ఉన్నాయి. ఆస్తి పన్ను రశీదులు ఉన్నాయి. విద్యుత్ కనెక్షన్ ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చినవే. అలాంటివారి ఇళ్లను అర్ధరాత్రి వేళ ఖాళీ చేయించి కూల్చివేయడం అమానుషం కాదా? ఏ ఇంటిని ముట్టుకున్నా అక్కడ పేదోళ్ల కన్నీటి కథలే కనిపిస్తున్నాయి. చిన్నారులు రోడ్డుపై ఉన్నారు. వృద్ధులు ఆకాశం కిందే ఆశ్రయం పొందుతున్నారు. ఇది ప్రభుత్వ కర్కశత్వం కాకపోతే మరేమిటి?” అని ప్రశ్నించారు. “గతంలో జీవోల ప్రకారం దరఖాస్తులు చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడే నివసించారని ప్రజలు చెబుతున్నారు. సంవత్సరాలుగా పన్నులు చెల్లించారు. ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు అదే ప్రభుత్వం అక్రమం అంటోంది. ఇది న్యాయమా? ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బుల్డోజర్లు పంపడం సరైన పరిపాలనలా కనిపిస్తుందా?” అని నిలదీశారు.
పత్రాలే సాక్ష్యం… పేదలే నష్టపోయారు
“బాధితులు తమ పత్రాల కట్టలను నాకు చూపించారు. భూదాన్ కేటాయింపు పత్రాలు, పన్ను రశీదులు, ఇంటి సంఖ్య నమోదు, ఇతర ఆధారాలు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వానికే పన్నులు చెల్లించిన ప్రజలను ఒక్కసారిగా తప్పుదారులుగా ముద్రవేయడం అన్యాయం. ఇళ్ల కూల్చివేతతో పిల్లల చదువులు ఆగిపోయాయి. కుటుంబాల జీవనోపాధి దెబ్బతింది. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?” అని కేటీఆర్ ప్రశ్నించారు. “భూదాన్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. ఈ అంశాన్ని శాసనసభలో ప్రస్తావిస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తాం. చట్టపరమైన అన్ని మార్గాలు అనుసరిస్తాం. పేదల హక్కుల కోసం వెనుకడుగు వేయం” అని స్పష్టం చేశారు. “ఎవరూ అధైర్యపడవద్దు. వచ్చే మా ప్రభుత్వంలో కూల్చిన చోటే ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తాం. గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. ప్రభుత్వం బాధితులను విడదీసే ప్రయత్నం చేస్తోంది. కానీ మీరు ఐక్యంగా ఉంటేనే న్యాయం సాధ్యమవుతుంది. చట్టం మీవైపే ఉంది. భయపడాల్సిన అవసరం లేదు” అని భరోసా ఇచ్చారు. “వెలుగుమట్ల ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కానీ నాకు రాజకీయాల కంటే ముఖ్యమైంది పేదల గృహహక్కు. పేదల ఇళ్లపై బుల్డోజర్ నడిపే పాలనను మేము సహించం. ఈ ప్రభుత్వానికి మేము ప్రశ్న వేస్తూనే ఉంటాం. పేదలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు” అని కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు.


