కలాం శాస్త్రీయ ప్రతిభ పరీక్షకు భారీ స్పందన
25 వేల మందికి పైగా విద్యార్థుల భాగస్వామ్యం
ఏప్రిల్ 14న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి అవార్డులు
కాకతీయ, గజ్వేల్ : ఈ అభ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12వ కెఎస్ఏటి – కలాం సైంటిఫిక్ ఆటిట్యూడ్ టెస్ట్ (కలాం శాస్త్రీయ ప్రతిభ పరీక్ష)కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించినట్లు అకాడమీ ఛైర్మన్ డా. భువనగిరి ఫణి పవన్ శాస్త్రి తెలిపారు. తెలంగాణలోని 275కు పైగా అనుబంధ పాఠశాలల్లో జనవరి 18న జరిగిన తొలి దశ పరీక్షకు సుమారు 25,000కి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతి నుండి 1, 2, 3 ర్యాంకులు సాధించిన 12,500కి పైగా విద్యార్థులు రెండవ దశకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 15 కేంద్రాల్లో ఏకకాలంలో ఓఎంఆర్ విధానంలో రెండవ దశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 1, 2, 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఏప్రిల్ 14న హైదరాబాద్లో జరిగే 12వ అభ్యాసోత్సవ్ సందర్భంగా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ సీఈఓ బి. మణికంఠ వెల్లడించారు. విజేతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు, నగదు బహుమతులు అందజేయనున్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, విశ్లేషణాత్మక నైపుణ్యం, తార్కిక ఆలోచన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


