విశాఖ జోన్లోకి మధిర రైల్వే స్టేషన్..?
సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడకు మార్పుపై ఆందోళన
స్టేషన్ ఆదాయం ఆంధ్రకు వెళ్లే ప్రమాదమని ఆగ్రహం
రైళ్ల నిలుపుదల తగ్గే అవకాశంపై ప్రయాణికుల్లో భయం
మధిర స్టేషన్ ప్రాధాన్యం తగ్గిపోతుందని స్థానికుల ఆవేదన
తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందంటూ ప్రజల్లో విమర్శలు
వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్
స్టేషన్ను సికింద్రాబాద్ డివిజన్లోనే కొనసాగించాలని విజ్ఞప్తి
కాకతీయ, మధిర : ఖమ్మం జిల్లాలోని మధిర రైల్వే స్టేషన్ను సికింద్రాబాద్ డివిజన్ పరిధి నుంచి విజయవాడ డివిజన్లోకి మార్చే ప్రతిపాదనలు స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ డివిజన్లో కొనసాగుతున్న ఈ స్టేషన్ను కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోని విజయవాడ డివిజన్లో కలుపుతున్నారన్న సమాచారం వెలువడింది. ఈ పరిణామంతో తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న కీలక రైల్వే స్టేషన్ పరిపాలన ఇతర రాష్ట్ర పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మధిర రైల్వే స్టేషన్ ద్వారా వచ్చే ఆదాయం ఇప్పటివరకు తెలంగాణకు చెందుతుండగా, విజయవాడ డివిజన్లోకి మారితే ఆ ఆదాయం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. తెలంగాణలో ఉన్న స్టేషన్ ఆదాయం ఇతర రాష్ట్రానికి మళ్లడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పందించకపోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
రైళ్ల నిలుపుదల తగ్గే ప్రమాదం
మధిర రైల్వే స్టేషన్ ఖమ్మం జిల్లా ప్రజలకు ముఖ్యమైన రవాణా కేంద్రంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైళ్లు మధిరలో నిలుస్తున్నప్పటికీ, భవిష్యత్తులో ఈ స్టేషన్ విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్తే రైళ్ల నిలుపుదల తగ్గే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రైళ్లు ఒక దిశలో మాత్రమే నిలుస్తున్నాయని, ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రైల్వే పరంగా మధిర సెక్షన్ పరిధి దెందుకూరు నుంచి పందిళ్లపల్లి వరకు విస్తరించి ఉన్నప్పటికీ, ప్రస్తుతం కొండపల్లి నుంచి మోటమర్రి వరకు ఉన్న కొంత భాగాన్ని విజయవాడ డివిజన్లో కలుపుతున్నట్లు సమాచారం. ఈ మార్పు కారణంగా భవిష్యత్తులో మధిర స్టేషన్ ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్
పరిపాలన పరంగా స్టేషన్ విజయవాడ డివిజన్లోకి మారితే స్థానిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్ర అధికారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ అభివృద్ధి, సౌకర్యాల కల్పన వంటి అంశాలు కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. మధిర స్టేషన్ ఖమ్మం తర్వాత జిల్లాలో కీలక రైల్వే కేంద్రంగా ఉండటంతో దీని ప్రాధాన్యం తగ్గిపోవడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి మధిర రైల్వే స్టేషన్ను సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనే కొనసాగించేందుకు కేంద్ర రైల్వే శాఖతో చర్చలు జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


