మసీద్పల్లిలో ఈతవనం భూమిపై వివాదం
– గౌడ–ముదిరాజ్ వర్గాల మధ్య ఉద్రిక్తత
– జీవనాధారమైన ఈత చెట్ల తొలగింపుపై ఆగ్రహం
– పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం
కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని మసీద్పల్లి గ్రామంలో గౌడ సంఘం, ముదిరాజ్ వర్గాల మధ్య ఈతవనం భూమి వివాదం చెలరేగింది. జీవనోపాధిగా భావిస్తున్న ఈత చెట్లను ముదిరాజ్ వర్గానికి చెందిన కొందరు ట్రాక్టర్తో ధ్వంసం చేశారని గౌడ సంఘం నాయకులు ఆరోపించారు. గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ… గతంలో గౌడ సంఘానికి సంబంధించిన స్థలం సొసైటీ లేకపోవడంతో ఎల్లమ్మ గుడి ట్రస్ట్ పేరిట నమోదు చేసినట్లు తెలిపారు. అప్పటి ప్రభుత్వంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత మొక్కలు నాటినట్లు చెప్పారు. మంజీరా పైప్లైన్ పనుల సందర్భంలో రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వగా, మిగతా ప్రభుత్వ భూమిని ఎల్లమ్మ గుడి పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు పేర్కొన్నారు. అప్పటి మంత్రి, ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులు కూడా హాజరై మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇటీవల ఆ భూమి తమదేనంటూ ముదిరాజ్ వర్గానికి చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేసి ట్రాక్టర్తో కొన్ని ఈత మొక్కలను తొలగించడంతో వివాదం మరింత ముదిరింది. ఇరువర్గాలు రోడ్డుపైకి వచ్చి వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చెట్లు తొలగించిన వారిని గజ్వేల్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎక్సైజ్ ఎస్సై తెలిపారు. తొగుట సీఐ లతీఫ్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. గౌడ సంఘం సభ్యులు తమ జీవనాధారమైన ఈత చెట్లను ధ్వంసం చేయడం తీరని నష్టమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివరాం గౌడ్, గౌడ సంఘం నాయకులు జయ వెంకటస్వామి, నరేష్ గౌడ్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


