ముగిసిన సెక్యూరిటీ ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణ తరగతులు
కాకతీయ, కొత్తగూడెం: సింగరేణి వ్యాప్తంగా పిసి అండ్ పిసిసెక్యూరిటీ గార్డులకు విడతల వారీగా నిర్వహించే ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణా తరగతులలో భాగంగా నాలుగు రోజుల పాటు కొత్తగూడెం ట్రైనింగ్ సెంటర్ నందు నిర్వహించిన 54వ ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణా తరగతులు శుక్రవారంతో ముగిసాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా సెక్యూరిటీ అధికారి ట్రైనింగ్ అధికారి యం.డి. జాకీర్ హుస్సేన్ పాల్గొని మాట్లాడారు. సెక్యూరిటీ సిబ్బంది అందరికీ క్రమశిక్షణ అనేది ముఖ్యమని పేర్కొన్నారు. మనం క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నపుడే గుర్తింపు వస్తుందని, ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణ సెక్యూరిటీ సిబ్బంది అందరికీ అవసరమన్నారు. ఈ శిక్షణ వలన డ్యూటీ జీవితంలోనే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ఉపయోగకరమైనదని చెప్పారు. ఈ నాలుగు రోజుల శిక్షణా కాలంలో ట్రాఫిక్ రెగ్యులేటరీ చట్టం, మాండేటరీ, కాషనరీ, ఇన్ఫర్మేటరీ సిగ్నల్స్, ట్రాఫిక్ పాయింట్ మన్ డ్యూటీస్, క్రౌడ్ కంట్రోల్ వంటి అంశాలపై అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే పూర్తి అవగాహన కలిగించడం జరిగిందని తెలిపారు. ఈ శిక్షణ వలన ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా మెయిన్ గేటు వద్ద, చెక్ పోస్ట్ ల వద్ద రద్దీ లేకుండా సాఫీగా అందరు తమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు దోహదం చేస్తుందని, ఎస్ అండ్ పిసి విభాగం పటిష్టంగా ఉండేందుకు కావలసిన అన్ని రకాల చర్యలు ట్రైనింగ్ సెంటర్ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు యాజమాన్యం అందిస్తుందని వివరించారు. సెక్యూరిటీ సిబ్బంది అందరు మెరుగైన వృత్తి నైపుణ్యంతో అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ సింగరేణి ఆస్తులు స్థలాలను పరిరక్షించాలని సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. అనంతరం ఉత్తమ ట్రైనీలుగా ఎంపిక అయిన శ్రీనివాసరావు, శ్రీనివాస్ కు బహుమతి ప్రధానం చేశారు. శ్రీ జ్యోతి అనాథ వృద్ధుల శరణాలయ నిర్వాహకులకు నిత్యవసరాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇన్ స్పెక్టర్ డి.నారాయణరెడ్డి, ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.


