నాయరా పెట్రోల్ బంక్పై కల్తీ ఆరోపణలు
బైక్ ఆగిపోవడంతో యువకుడి ఫిర్యాదు
పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదన్న ఆరోపణ
కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలోని నాయరా పెట్రోల్ బంక్లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారంటూ ఓ యువకుడు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లోక్యతండాకు చెందిన వాడిత్య సాయికుమార్ బుధవారం తన ద్విచక్ర వాహనంలో రూ.50 విలువైన పెట్రోల్ నింపించుకొని వెళ్లగా, అర కిలోమీటరు దూరం వెళ్లకముందే వాహనం ఆగిపోయింది. అనుమానం వచ్చిన యువకుడు ఇంటికి చేరుకుని పెట్రోల్ను పరిశీలించగా తెల్లటి ద్రవంగా కనిపించడంతో మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే తిరిగి పెట్రోల్ బంక్కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశాడు. రాజీ ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఇతరులు మోసపోకూడదనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని సమాచారం. ఇదే పెట్రోల్ బంక్పై గతంలోనూ నాణ్యత లేని పెట్రోల్ విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


