రెబర్తి లో కనువిప్పు’.. సైబర్ మోసాలపై అవగాహన కల్పించిన పోలీసులు..!
* కాకతీయ, మద్దూర్: మద్దూర్ మండల పరిధిలోని రెబర్తి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ‘కనువిప్పు’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మద్దూర్ ఏ ఎస్ఐ సదాశివరావు గ్రామస్థులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఏ ఎస్ఐ సదాశివరావు మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న నేరాలు, సైబర్ మోసాలు, మరియు సామాజిక రుగ్మతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పకూడదని, ఫోన్కు వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు.గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, గ్రామంలో ఎవరైనా గంజాయి విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏ ఎస్ఐ సదాశివరావు తెలిపారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని గ్రామస్థులకు వివరించారు. పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజల రక్షణ కోసం అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా ఏ ఎస్ఐ భరోసా ఇచ్చారు. ఏదైనా ఆపద సమయం లో తక్షణమే 100 నంబర్కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏవాళ్ళు ఏ ఎస్ఐ సదాశివరావు కోరారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



