మహాశివరాత్రి సందర్భంగా ఆర్జేసీ కృష్ణ ప్రత్యేక పూజలు
కాకతీయ,ఖమ్మం: మహాశివరాత్రి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్బీఐటీ, ఆర్జేసి విద్యాసంస్థల చైర్మన్ గుండాల (ఆర్జేసి) కృష్ణ దంపతులు ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూసుమంచి శ్రీ గణపేశ్వర స్వామి ఆలయం, తెల్దారుపల్లి శివాలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణ దంపతులకు శేషవస్త్రాలతో ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు అందించారు. కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన గణపేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెల్దారుపల్లి శివాలయంలో శివయ్యను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా గుండాల కృష్ణ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని పరమశివుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


