బెల్లంపల్లిలో కారు స్పీడ్… కాంగ్రెస్కు షాక్!
కాంగ్రెస్కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరిక
హంగ్ మున్సిపాలిటీలో కారు పార్టీకి పెరిగిన సంఖ్యాబలం
చైర్మన్ పీఠం దిశగా బీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు
కాంగ్రెస్లో కలకలం… చేరికలపై తీవ్ర విమర్శలు
ఇండిపెండెంట్లు, బీజేపీ మద్దతు ఇంకా కీలకమే
ఎక్స్ఆఫిషియో ఓటుతో ఫలితం మారే అవకాశాలు
కాకతీయ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే హంగ్ పరిస్థితులతో ఉత్కంఠభరితంగా మారిన ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరడం కీలక పరిణామంగా మారింది. ఈ చేరికలతో కారు పార్టీ సంఖ్యాబలం మరింత పెరిగి, చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశాలు బలపడినట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఈ ఇద్దరు కౌన్సిలర్లు తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సమాచారం. ఇప్పటికే హంగ్ పరిస్థితులతో కొనసాగుతున్న ఈ మున్సిపాలిటీలో ఈ చేరికలు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేలా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకత్వం ఈ చేరికలను వ్యూహాత్మక విజయంగా భావిస్తుండగా, కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం ఆందోళన నెలకొంది.

హంగ్ మున్సిపాలిటీలో మారిన సమీకరణాలు
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బెల్లంపల్లి మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులకు గాను ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో 14 వార్డులు గెలుచుకుని సమాన స్థాయిలో నిలిచాయి. స్వతంత్రులు 5 వార్డులు గెలుచుకోగా, బీజేపీ ఒక వార్డులో విజయం సాధించింది. దీంతో చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చాయి. బీజేపీకి చెందిన కౌన్సిలర్తో పాటు మరికొందరు సభ్యులు బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించగా, తాజాగా కాంగ్రెస్కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా కారు పార్టీలో చేరడం కీలకంగా మారింది. ఈ చేరికలతో బీఆర్ఎస్ సంఖ్యాబలం గణనీయంగా పెరిగి, చైర్మన్ పదవిని దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

చేరికలపై రాజకీయ విమర్శలు
బీఆర్ఎస్ నాయకులు ఈ చేరికలను స్వాగతిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలనే లక్ష్యంతోనే కౌన్సిలర్లు పార్టీలో చేరారని పేర్కొంటున్నారు. బెల్లంపల్లి అభివృద్ధికి బీఆర్ఎస్తో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును విస్మరించి అధికార ఆశతో పార్టీ మారడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయ నైతికతకు విరుద్ధమని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎక్స్ఆఫిషియో ఓటు, ఇతరుల మద్దతు కీలకం
ప్రస్తుతం బెల్లంపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ కొనసాగుతున్నప్పటికీ, ఇండిపెండెంట్లు, బీజేపీ సభ్యుల మద్దతు ఇంకా కీలకంగానే ఉంది. అదే సమయంలో ఎక్స్ఆఫిషియో ఓటు కూడా నిర్ణయాత్మకంగా మారే అవకాశం కనిపిస్తోంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ఎక్స్ఆఫిషియో సభ్యునిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ ఓటు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందన్నది ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశముంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బెల్లంపల్లి రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. చివరి క్షణం వరకు రాజకీయ చర్చలు, వ్యూహాలు కొనసాగే అవకాశం ఉండటంతో బెల్లంపల్లి మున్సిపాలిటీ పీఠం ఎవరి ఖాతాలో పడుతుందన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది.


