‘రెడ్–హస్తం’ కుస్తీ..!
కొత్తగూడెంలో మేయర్ కుర్చీపై ఉత్కంఠ
మ్యాజిక్ ఫిగర్కు దూరంగా కాంగ్రెస్, సీపీఐ
తలో 22 స్థానాలు గెల్చుకోవడంతో సమాన స్థితి..
బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్తో రాజకీయంగా సీపీఐ కొత్త ఆలోచనలు
మంత్రి పొంగులేటి వ్యవహారంపై ఎమ్మెల్యే కూనంనేని అసంతృప్తి?
సీపీఐ కౌన్సిలర్లకు కాంగ్రెస్ కోటి ఆశలంటూ పట్టణ రాజకీయ వర్గాల్లో చర్చ..
సీపీఐని నిలబెట్టేందుకు సీఎం రేవంత్ రంగంలోకి
మేయర్ ఎన్నికకు ముందు క్యాంపు రాజకీయాలతో హైటెన్షన్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠం కోసం రాజకీయ పోరు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఇటీవల వెలువడిన ఫలితాలు హంగ్కు దారితీయడంతో అధికార సమీకరణాలు పూర్తిగా అనిశ్చిత దిశలోకి వెళ్లాయి. మొత్తం 60 డివిజన్లున్న కార్పొరేషన్లో మేయర్ పీఠానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31 కాగా, కాంగ్రెస్, సీపీఐ తలో 22 స్థానాలు గెలుచుకుని సమాన స్థాయిలో నిలిచాయి. బీఆర్ఎస్ 8, ఇండిపెండెంట్లు 6, బీజేపీ 1 సీటు సాధించడంతో ఇప్పుడు కార్పొరేషన్ రాజకీయ భవితవ్యం సీపీఐ నిర్ణయంపైనే ఆధారపడింది. ఈ ఫలితాలతో కొత్తగూడెం రాజకీయాలు ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒంటరిగా ఏ పార్టీ అధికారాన్ని సాధించలేని పరిస్థితి రావడంతో మేయర్ పీఠం సంఖ్యలకన్నా సమీకరణాలపై ఆధారపడే స్థితి ఏర్పడింది. ముఖ్యంగా సీపీఐ ఎటువైపు మొగ్గు చూపుతుందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్తో సీపీఐలో కొత్త ఆలోచనలు
ఫలితాలు వెలువడిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రకటనతో కొత్తగూడెం రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. సీపీఐ అభ్యర్థికి తమ 8 మంది కార్పొరేటర్లు నిరుపాధిక మద్దతు ఇస్తారని ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగు వేసింది. ఈ మద్దతుతో సీపీఐ మ్యాజిక్ ఫిగర్కు చేరుకునే అవకాశం ఉండటంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ ఈ నిర్ణయం వెనుక కాంగ్రెస్ను అధికారానికి దూరంగా ఉంచాలన్న వ్యూహంతో పాటు సీపీఐతో సంబంధాలను బలోపేతం చేయాలన్న లక్ష్యం కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో సీపీఐ ఇప్పుడు రెండు ప్రధాన పార్టీల మధ్య కీలక స్థానంలో నిలిచింది.
మంత్రి డామినేషన్పై కూనంనేని అసంతృప్తి..
కొత్తగూడెం రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత్ర కూడా చర్చనీయాంశంగా మారింది. స్థానిక రాజకీయాల్లో మంత్రి అధికంగా జోక్యం చేసుకుంటున్నారన్న అసంతృప్తి సీపీఐ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో సీపీఐకి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న భావన ఆ పార్టీ నాయకత్వంలో పెరిగినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్–సీపీఐ పొత్తును కొనసాగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీపీఐ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి సమీకరణాలను కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేయర్ పీఠాన్ని సీపీఐకి ఇచ్చి, డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ తీసుకునే ఫార్ములాపై కూడా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఇది అమలైతే కాంగ్రెస్–సీపీఐ కలిసి కార్పొరేషన్పై అధికారం సాధించే అవకాశాలు బలపడతాయి.
క్యాంపు రాజకీయాలతో హైటెన్షన్..
మేయర్ ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. తమ కార్పొరేటర్లు ప్రత్యర్థి పార్టీల ప్రభావానికి లోనుకాకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు వారిని ప్రత్యేక ప్రదేశాలకు తరలించినట్లు సమాచారం. ఇండిపెండెంట్ల మద్దతు కూడా కీలకంగా మారడంతో వారిని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ప్రతి ఓటు కీలకంగా మారిన పరిస్థితిలో చివరి నిమిషం వరకు రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హామీలు, చర్చలు, వ్యూహాలు కలిసి ఇప్పుడు కొత్తగూడెం రాజకీయాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. కొత్తగూడెం మేయర్ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక ఘట్టంగా మారింది. సీపీఐ కాంగ్రెస్తో కలిసి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందా, లేక బీఆర్ఎస్ మద్దతుతో కొత్త సమీకరణం ఏర్పడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 16న జరిగే మేయర్ ఎన్నికతో కొత్తగూడెం కార్పొరేషన్ అధికార సమీకరణాలు స్పష్టమవనున్నాయి. అప్పటి వరకు కొత్తగూడెం రాజకీయాలు పూర్తిగా ‘నంబర్ల’ కంటే ‘నెగోషియేషన్ల’ చుట్టూనే తిరిగే పరిస్థితి నెలకొంది.


