కల్లూరు పీఠంపై కాంగ్రెస్లో హోరాహోరీ
చైర్మన్ పదవిపై ముగ్గురు ఆశావహుల మధ్య తీవ్ర పోటీ
ఉన్నత నాయకత్వం చుట్టూ ముమ్మర లాబీయింగ్
వైస్ చైర్మన్ పదవిపైనా ఉత్కంఠ
కాకతీయ, కల్లూరు : కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించినప్పటికీ, చైర్మన్ పదవిపై పార్టీలో అంతర్గత పోటీ తీవ్రంగా మారింది. మొత్తం 12 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఆశావహులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఎస్టీ వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించడంతో చైర్మన్ పదవిపై వారి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఫలితాలు వెలువడిన వెంటనే ఆశావహులు పార్టీ ఉన్నత నాయకత్వాన్ని సంప్రదిస్తూ తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. స్థానికంగా మద్దతు సమీకరణలు చేసుకోవడంతో పాటు, పార్టీ కీలక నేతల అనుకూలత కోసం లాబీయింగ్ కొనసాగిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వైస్ చైర్మన్ పదవిపైనా ఆశావహుల దృష్టి
చైర్మన్ పదవితో పాటు వైస్ చైర్మన్ పదవిపైనా పలువురు నేతలు ఆశలు పెట్టుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ పదవుల కేటాయింపులో స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు, పార్టీ ఉన్నత నాయకత్వం కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడే వరకు ఉత్కంఠ కొనసాగనుంది. పార్టీ అంతర్గత సమీకరణాలు, సామాజిక సమతుల్యత, నాయకత్వ నిర్ణయం ఆధారంగానే తుది ఎంపిక ఉండే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.


