సమ్మెకు దూరంగా ఉండండి
సింగరేణి కార్మికులకు జీఎం రామచందర్ విజ్ఞప్తి
కాకతీయ, మణుగూరు టౌన్ : ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని మణుగూరు ఏరియా జీఎం రామచందర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, సింగరేణి సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్మికులు యథావిధిగా తమ విధులు నిర్వర్తించాలని సూచించారు.
సింగరేణి సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రతి ఉద్యోగి సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. సమ్మె వంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సంస్థకు, కార్మికులకు నష్టం కలుగుతుందని తెలిపారు. అందువల్ల కార్మిక సంఘాల నాయకులు కూడా బాధ్యతగా వ్యవహరించి సమ్మెకు పిలుపునివ్వకుండా సహకరించాలని కోరారు.
కార్మికులు తమ విధులను కొనసాగిస్తూ సంస్థ పురోగతికి తోడ్పడాలని, సింగరేణి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జీఎం రామచందర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.


