పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు
మునిసిపల్ ఎన్నికల్లో రికార్డు శాతం పోలింగ్
ఖమ్మం జిల్లాలో 82.50%, భద్రాద్రి జిల్లాలో 73.60% నమోదు
గతానికి కన్నా పెరిగిన ఓటు శాతం నమోదు
ఓటేసిన వారిలో మహిళా ఓటర్లే అధికం
చెదురు మొదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతం
ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటరు తీర్పు
13న ఓట్ల లెక్కింపునకు అధికారుల ఏర్పాట్లు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన పోలింగ్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడం, భారీ సంఖ్యలో మహిళలు ఓటింగ్లో పాల్గొనడం ఈ ఎన్నికల ప్రత్యేకతగా నిలిచాయి. ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 82.50 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లాలో మొత్తం 1,41,875 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,17,043 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 55,506 మంది, మహిళలు 61,520 మంది ఉండటం విశేషం. మహిళా ఓటర్లే అధికంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి గంటగంటకూ శాతం పెరుగుతూ వచ్చింది. ఉదయం 9 గంటల వరకు 15.37%, 11 గంటలకు 37.10%, మధ్యాహ్నం 1 గంటకు 59.41%, సాయంత్రం 3 గంటలకు 72.93% పోలింగ్ నమోదైంది. చివరికి సాయంత్రం 5 గంటల సమయానికి 82.30 శాతానికి చేరింది. క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు టోకెన్లు ఇచ్చి ఓటు వేసే అవకాశం కల్పించామని అధికారులు తెలిపారు.

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
పోలింగ్ సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించగా, సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్వయంగా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 73.60 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వెల్లడించారు. మొత్తం 1,85,348 మంది ఓటర్లలో 1,36,423 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల్లో 73.70 శాతం, మహిళల్లో 73.51 శాతం పోలింగ్ నమోదవడం గమనార్హం. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, ఇల్లందు మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్ల రద్దీ కనిపించింది. అన్ని కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ నిర్వహించామని అధికారులు తెలిపారు.
ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ
పోలింగ్ విజయవంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ నెల 13న జరగనున్న ఓట్ల లెక్కింపుపై కేంద్రీకృతమైంది. ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారీగా నమోదైన ఓటింగ్ శాతం ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన సిబ్బంది, పోలీసు యంత్రాంగం, రాజకీయ పార్టీలు, ప్రజలకు రెండు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల చైతన్యం వల్లే ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని అధికారులు అభిప్రాయపడ్డారు.
మున్సిపాలిటీల వారీగా పోలింగ్ శాతం
మున్సిపాలిటీ పోలింగ్ శాతం
ఏదులాపురం 85.45%
వైరా 83.71%
సత్తుపల్లి 77.81%
కల్లూరు 87.08%
మధిర 78.19%
అశ్వరావుపేట 76.28%
కొత్తగూడెం కార్పొరేషన్ 74.53%
ఇల్లందు 68.56%


