గ్రామం కాదు..పట్టణం కాదు
మణుగూరు మునిసిపాలిటీలో విలీనమై అరిగోస
కేంద్ర ప్రభుత్వ పథకాలకు దూరమైన విలీన గ్రామాల ప్రజలు
విలీనానికి ముందు జీపీల్లో ఉపాధి హామీ కింద పనుల కేటాయింపు
ఉపాధి హామీ పనులు లేక 20 ఏళ్లుగా అవస్థలు
ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ప్రజల డిమాండ్
కాకతీయ, మణుగూరు టౌన్ : మణుగూరు పరిధిలోని పలు గ్రామాలను పట్టణ పరిపాలనలో విలీనం చేయడం అక్కడి ప్రజలకు వరంగా కాకుండా శాపంగా మారింది. అభివృద్ధి పేరుతో జరిగిన ఈ విలీన నిర్ణయం వల్ల ఆయా గ్రామాల ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు దూరమై తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయిగూడెం, అన్నారం, కమలాపురం తదితర గ్రామాలు గత రెండు దశాబ్దాలుగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా గ్రామీణ పేదలకు జీవనాధారంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) ఈ గ్రామాలకు వర్తించకపోవడం పెద్ద సమస్యగా మారింది. గ్రామీణ హోదా కోల్పోవడం వల్ల ఉపాధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని, ఫలితంగా వందలాది కుటుంబాలు ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. విలీనానికి ముందు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నప్పుడు ఉపాధి హామీ కింద పనులు దొరికేవని, ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా పోయిందని అంటున్నారు.
ఉపాధి లేక 20 ఏళ్లుగా నరకయాతన
విలీన గ్రామాల్లో నివసించే పేద, కూలీ కుటుంబాలు గత ఇరవై ఏళ్లుగా ఉపాధి హామీ పథకం కింద ఒక్క రోజు కూడా పని పొందలేదని ఆరోపిస్తున్నారు. గ్రామీణ పథకాలు వర్తించని స్థితి, మరోవైపు పట్టణ పథకాలు సక్రమంగా అందని పరిస్థితి ఏర్పడటంతో ప్రజలు రెండు వ్యవస్థల మధ్య నలిగిపోతున్నారు. “మేము గ్రామంలో ఉన్నామా, పట్టణంలో ఉన్నామా అనే స్పష్టతే లేదు. ఏ పథకం మాక్కు అందడం లేదు. ఉపాధి పనులు లేక కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయి” అని అన్నారం గ్రామానికి చెందిన ఓ కూలీ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు లేని కాలంలో ఉపాధి హామీనే ప్రధాన ఆధారమని, అది లేకపోవడంతో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని పలువురు పేర్కొంటున్నారు.
వలస బాట పట్టిన కుటుంబాలు
పనులు లేకపోవడంతో అనేక కుటుంబాలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. యువత ఇతర పట్టణాలకు వెళ్లి కూలి పనులు చేసుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. విలీన నిర్ణయం వల్ల అభివృద్ధి జరుగుతుందని ఆశించినా, వాస్తవంలో జీవనం మరింత దుర్భరంగా మారిందని అంటున్నారు. పాలనా లోపాలే ఈ దుస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామాలను విలీనం చేసినప్పటికీ అక్కడ పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ సమస్యలు ఏర్పడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వంపై ప్రజల డిమాండ్లు
విలీన గ్రామాల సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని ఈ గ్రామాలకు ప్రత్యేకంగా వర్తింపజేయాలని, లేకపోతే పట్టణ పరిధిలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే విలీన నిర్ణయాన్ని పునఃసమీక్ష చేయాలని కూడా సూచిస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకోకపోతే, రానున్న రోజుల్లో విలీన గ్రామాల ప్రజల పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.


