పింక్ డ్రెస్సులు వేసుకోండి అంటూ పోలీసులపై అభ్యర్థి భర్త హంగామా
చేర్యాలలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భర్త పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. రెండో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల తేజ భర్త కాటం సంజీవయ్య బుధవారం బాయ్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నాయకులు వచ్చి హడావుడి చేసి వెళ్లారని, పోలీసులు వారికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సంజీవయ్య పోలీసులతో వాగ్వాదానికి దిగారు. “మీరు పోలీస్ డ్రెస్ కాకుండా బీఆర్ఎస్ పార్టీ పింక్ డ్రెస్ వేసుకోండి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టం ప్రకారం పని చేయాలని, బీఆర్ఎస్కు తొత్తులుగా మారితే సహించబోమని హెచ్చరికలు చేశారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఈ హడావుడి కొంతసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. విధుల్లో ఉన్న పోలీసులు సంజీవయ్యను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన అసభ్యకరంగా మాట్లాడడం అక్కడి ఓటర్లను విస్మయానికి గురిచేసింది.
ప్రజాస్వామ్య విధుల్లో నిమగ్నమైన పోలీసులపై ఇలా ప్రవర్తించడం సరికాదని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తులు ప్రజా ప్రతినిధుల కుటుంబాల్లో ఉండడం సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని పలువురు విమర్శిస్తున్నారు.


