మణుగూరుకు మున్సిపాలిటీ హోదా ఎప్పుడో?
పట్టించుకోని ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి
ప్రజాస్వామ్య హక్కులపై బహిరంగ చర్చకు డిమాండ్
ఆదాయం ఇస్తున్నా – పాలనా హక్కులు ఎందుకు లేవు?
సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్న ఉద్యమ స్వరం
కాకతీయ, మణుగూరు టౌన్ : వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ములుగును ఇటీవల మున్సిపాలిటీగా ప్రకటించిన నేపథ్యంలో, మణుగూరుకు మాత్రం ఆ హోదా ఎందుకు దక్కలేదన్న ప్రశ్న ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. రాష్ట్రానికి బొగ్గు, విద్యుత్ రంగాల్లో కీలక ఆదాయం అందిస్తున్న మణుగూరు పట్టణాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మణుగూరుకు మున్సిపాలిటీ హోదా కల్పించాలన్న డిమాండ్ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, ఇది పూర్తిగా ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల అంశమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పట్టణ ప్రాంతాలకు స్వయం పాలన హక్కు ఉన్నప్పటికీ, మణుగూరులో ఆ హక్కు ఇరవై ఏళ్లుగా అమలుకు నోచుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు, గనులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న మణుగూరును పాలనా పరంగా మాత్రం పట్టించుకోకపోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు.
వివిధ వర్గాల నుంచి మద్దతు
మణుగూరుకు మున్సిపాలిటీ హోదా అంశంపై పట్టణంలోని కార్మిక సంఘాలు, వ్యాపార వర్గాలు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నాయి. “రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే మణుగూరుకు కనీసంగా స్వయం పాలన హక్కు కూడా ఇవ్వకపోవడం దారుణం” అని కార్మిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార వర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. “మున్సిపాలిటీ లేకపోవడంతో అభివృద్ధి పనులు పూర్తిగా అధికారుల నిర్ణయాలకే పరిమితమవుతున్నాయి. ప్రజల అవసరాలకు తగినట్టుగా ప్రణాళికలు రూపొందడం లేదు” అని వారు అంటున్నారు. యువత కూడా ఈ డిమాండ్ను భుజానికెత్తుకుంది. సామాజిక మాధ్యమాల్లో ‘మణుగూరుకు మున్సిపాలిటీ కావాలి’ అనే నినాదాలతో పోస్టులు వైరల్ అవుతుండటం ఉద్యమ తీవ్రతను తెలియజేస్తోంది. విద్యార్థులు, యువకులు బహిరంగ చర్చలు, సదస్సులు నిర్వహించాలని కోరుతున్నారు.
మౌలిక సదుపాయాలపై ప్రభావం
మణుగూరులో మున్సిపాలిటీ లేకపోవడం వల్ల ప్రజలకు నేరుగా ఎన్నుకున్న పాలకులు లేకుండా పోయారని స్థానికులు వాపోతున్నారు. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, వీధి దీపాలు, వైద్య సదుపాయాల వంటి మౌలిక అంశాల్లో సరైన ప్రణాళికాబద్ధ అభివృద్ధి జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఎవరు బాధ్యత తీసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన వ్యవస్థ కనిపించడం లేదని పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారు.
మున్సిపాలిటీ హోదా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నేరుగా అభివృద్ధి నిధులు వచ్చే అవకాశాలు ఉంటాయని, ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు దొరుకుతాయని మేధావులు చెబుతున్నారు.
ప్రభుత్వ స్పందనపై ఎదురుచూపు
ములుగుకు మున్సిపాలిటీ హోదా ప్రకటించిన ప్రభుత్వం, అదే తరహా నిర్ణయం మణుగూరుపై ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ప్రభుత్వ మౌనం కారణంగా ప్రజల్లో అసంతృప్తి మరింత పెరుగుతోంది. ఈ అంశంపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పష్టత ఇవ్వాలని, మణుగూరు ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించాలని వివిధ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మణుగూరుకు మున్సిపాలిటీ హోదాపై బహిరంగ ప్రజా చర్చ నిర్వహించాలని, అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ అంశం రాజకీయంగానూ, సామాజికంగానూ కీలక చర్చగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి


