“ఓటేయాలంటే నోటు ఇవ్వాల్సిందే!”
అభివృద్ధి మాట పట్టని ఓటర్లు
ఓటేయాలంటే నోటు తప్పనిసరి
మినిమం 2 వేలు – మాక్సిమం 8 వేలు
వార్డును బట్టి మారుతున్న రేటు
మధిరలో బహిరంగంగానే పంపకాలు
ఎన్నికల్లో నిజాయితీ అంతా మిథ్యా..!
కాకతీయ, బోనకల్ : మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. సోమవారం వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వేదికలపై అభివృద్ధి మాటలతో పోటీపడ్డాయి. తాము చేసిన పనులు, చేయబోయే పనుల గురించి చెప్పుకుంటూ విమర్శలు–ప్రతివిమర్శలతో రాజకీయ వేడి రాజేసాయి. అభ్యర్థులు ప్రజలకు హామీల వర్షం కురిపించారు. సమస్యలు పరిష్కరిస్తామని, మధిర రూపురేఖలు మార్చేస్తామని ఊదరగొట్టారు. కానీ ప్రచారం ముగిసిన వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాధారణంగా ప్రజాప్రతినిధిగా గెలవాలంటే ప్రజల్లో నమ్మకం కలిగించాలి. అభివృద్ధిపై భరోసా ఇవ్వాలి. కానీ మధిర మున్సిపల్ ఎన్నికల్లో ఆ మాటలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఇప్పుడు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేది హామీలు కాదు – ఓటుకు ఎంత ఇచ్చారన్న లెక్క మాత్రమే! ప్రచారంలో అధికార పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మధిరకు మంజూరైన నిధులు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను వివరించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా గత పదేళ్లలో చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తూ కాంగ్రెస్పై విమర్శలు చేసింది. రెండు పక్షాలు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ ప్రచార పర్వం ముగిసిన క్షణం నుంచే అసలు ఎన్నికల రాజకీయం మొదలైంది. ప్రస్తుతం మధిర మున్సిపాలిటీలో 22 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు బీజేపీ, జనసేన అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. అయితే అభ్యర్థుల వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, సేవాభావం వంటి అంశాలు ఇప్పుడు పెద్దగా లెక్కలోకి రావడం లేదు. ఓటర్ల నుంచి వినిపిస్తున్న ఏకైక మాట – “ఓటేయాలంటే నోటు ఇవ్వాల్సిందే!”
ఓటుకు నోటు – ఇదే తుది తీర్పు
ఒకప్పుడు పేదలు మాత్రమే ఓటుకు ఏదో ఆశపడతారన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఆస్తులు ఉన్నవారు, సంపన్నులు కూడా “మా డబ్బులు ఏవి?” అంటూ రాజకీయ నాయకులను నిలదీస్తున్నారు. ఎన్నికల సమయంలో అందరూ అడుక్కునేవారిలా మారిపోయారని అభ్యర్థులే వాపోతున్నారు. ఈసారి ఓటు రేటు కూడా భారీగా పెరిగింది. కనిష్టంగా రూ.2,000 నుంచి గరిష్టంగా రూ.8,000 వరకు ఒక్కో ఓటుకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గట్టిపోటీ ఉన్న వార్డుల్లో అయితే రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు పలుకుతోంది. ఒక్కో వార్డులో సగటున 1,200 నుంచి 1,300 ఓటర్లు ఉంటారు. కనీసం రూ.2 వేల చొప్పున పంచినా అభ్యర్థికి రూ.10 లక్షల ఖర్చు తప్పదు. అంతకంటే తక్కువ ఇచ్చే అభ్యర్థి గెలుపు ఆశించడం కష్టమే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
పంపకాల్లో కొత్త ఎత్తుగడలు
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అనేక రకాల వ్యూహాలు అమలు చేస్తున్నారు. కొందరు అనుచరుల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు పంపిస్తుంటే, మరికొందరు నేరుగా ఇళ్లకు వెళ్లి చేతులెత్తి దండం పెట్టి మద్దతు కోరుతున్నారు. కొన్ని చోట్ల ఓటర్లకు డబ్బులు ఇస్తూ కర్పూరం వెలిగించి అగ్నీ సాక్షిగా ప్రమాణాలు చేయిస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్కు రప్పించేందుకు ప్రయాణ ఖర్చులు, వాహన సౌకర్యాలు కూడా అభ్యర్థులే భరిస్తున్నారు. దీంతో ఒక్కో ఓటుపై పడుతున్న ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. డబ్బులు పంచినా ఓటరు చివరకు ఎవరికీ ఓటేస్తాడో తెలియని పరిస్థితి అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎంత ఖర్చు చేసినా గెలుపుపై ధీమా మాత్రం ఎవరికీ లేదు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఈ పంపకాల పర్వం సాగుతున్నా, ఎన్నికల వ్యవస్థలో ఇది భాగంగానే మారిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల తర్వాత నాయకులు ప్రజలను పట్టించుకోరన్న భావన ఓటర్లలో బలంగా ఉండటంతో, ఈ అవకాశాన్ని నగదు రూపంలో వసూలు చేసుకోవడంలో తప్పేమీ లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇన్ని ఎత్తుగడలు, ఇన్ని పంపకాలు జరిగినా – చివరి క్షణంలో ఓటరు ఏ గుర్తుపై ముద్ర వేస్తాడో అన్నదే అసలు ప్రశ్న. ప్రచారం ముగిసింది… పంపకాలు కొనసాగుతున్నాయి… ఇక తేలాల్సింది ఒక్కటే.!
నోటుకు ఓటు పడుతుందా? లేక ఓటరు అంతరాత్మ గెలుస్తుందా? దానికి సమాధానం ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్తోనే తేలనుంది.


