ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర
ఇక మిగిలింది ప్రజా తీర్పే..!
ఖమ్మం–భద్రాద్రిలో హోరాహోరీ రాజకీయ సమరం
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముఖాముఖి పోరు
జనసేన, వామపక్షాల ప్రభావం ఎంత?
చివరి రోజు ర్యాలీలతో హోరెత్తిన పట్టణాలు
ప్రలోభాల ప్రచారంపై పెరిగిన నిఘా
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఉత్కంఠభరితంగా ముగిసింది. వారం రోజులుగా సాగిన రాజకీయ రణరంగం సోమవారం సాయంత్రం తెరపడింది. రోడ్షోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలతో ఉమ్మడి జిల్లా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్ కోసం ఇప్పుడు అభ్యర్థులు, పార్టీలు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య నేరుగా ముఖాముఖి పోరు కనిపించింది. కొన్ని చోట్ల వామపక్షాలు, జనసేన కూడా బరిలో ఉండటంతో త్రిముఖ, చతుర్ముఖ పోటీలు నెలకొన్నాయి. స్థానిక అంశాలు, అభివృద్ధి హామీలు, ప్రభుత్వ పనితీరు – ఇవే ప్రచారానికి కేంద్రబిందువులుగా మారాయి.
ఖమ్మం జిల్లాలో ఉత్కంఠభరిత పోటీ
ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో దూకుడుగా ప్రచారం నిర్వహించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదులాపురంలో విస్తృతంగా పర్యటిస్తూ, పేదలకు ఇళ్ల పట్టాలు, మౌలిక వసతుల కల్పన, పట్టణాభివృద్ధి హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరి రోజు ఆయన నిర్వహించిన భారీ రోడ్షో కాంగ్రెస్ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపింది. అధికార పార్టీకి మద్దతిస్తేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ నేతలు ప్రధానంగా ప్రచారం చేశారు. ఇదే సమయంలో వైరాలో బీఆర్ఎస్–సీపీఎం పొత్తు బలంగా రంగంలోకి దిగింది. మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. సీపీఐ జాతీయ నేత నారాయణ ఏదులాపురంలో ప్రచారం చేస్తూ “తల్లి పాలు–డబ్బా పాలు మధ్య పోరాటం” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వామపక్షాలు కొన్ని ప్రాంతాల్లో గట్టి ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన కూడా ఈ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. ఖమ్మం జిల్లాలో 17 వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టి యువతను లక్ష్యంగా చేసుకుని ప్రచారం సాగించింది.
భద్రాద్రి జిల్లాలో కార్పొరేషన్పై కేంద్రీకరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధాన పోరు కొత్తగూడెం కార్పొరేషన్ చుట్టూనే తిరిగింది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. భూముల క్రమబద్ధీకరణ (ల్యాండ్ రెగ్యులరైజేషన్) అంశం ఇక్కడ ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారింది. అన్ని పార్టీలు ఇదే అంశంపై హామీలు గుప్పించాయి. బీజేపీ రాష్ట్ర నేత ఎన్. రామచందర్ రావు కూడా కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో 22 వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టి పోటీలో నిలిచింది. కొన్ని డివిజన్లలో ఆ పార్టీ ఓట్ల చీలికకు కారణమయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రలోభాలే చివరి అస్త్రాలు?
ప్రచార ఘట్టం ముగియగానే రాజకీయాలు రహస్య దశకు చేరాయి. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ జరుగుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సంఘం నిఘా బృందాలు రంగంలోకి దిగినా, ప్రలోభాల రాజకీయాలు తెరవెనుక కొనసాగుతున్నాయని సమాచారం. సైలెన్స్ పీరియడ్ అమల్లోకి రావడంతో బహిరంగ ప్రచారానికి తెరపడినా, గుప్త సమావేశాలు, వ్యక్తిగత సంప్రదింపులు జోరుగా జరుగుతున్నాయి. ఫలితాలను ప్రభావితం చేసే కీలక ఘట్టం ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 9 సాయంత్రం నుంచి 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో ఎలాంటి ప్రచారం, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక అభివృద్ధి, సంక్షేమ హామీలు, ప్రభుత్వ పనితీరు కీలక అంశాలుగా మారాయి. కాంగ్రెస్ అధికార బలంతో ముందుకెళ్తుంటే, బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రలో గట్టి పోరాటం చేసింది. వామపక్షాలు, జనసేన కొన్ని ప్రాంతాల్లో ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో నిలిచాయి. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ భవితవ్యం ఎవరి చేతుల్లోకి వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


