అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్కే ఓటెయ్యాలి
సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలంటే ప్రజలు సహకరించాలి
ఉద్యోగులు, మహిళల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగాలన్నా, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు చేరాలన్నా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజలను కోరారు. సోమవారం మధిరలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలు ప్రజా ప్రభుత్వానికి పరీక్ష లాంటివని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు నెల మధ్యలో పడేవని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు జమ చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి కోటి రూపాయల ప్రమాద బీమా అమలు చేయనున్నామని వెల్లడించారు. మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని, అవసరమైతే ఎన్ని వేల కోట్లైనా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. పట్టణాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పి మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. మధిర పట్టణాన్ని రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.


