కల్లూరులో కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ
కాకతీయ, కల్లూరు : కల్లూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషంగా నిలిచింది. కృష్ణ మ్యాంగో మార్కెట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ డీఎన్పీ ఫంక్షన్ హాల్ వరకు ఉత్సాహంగా సాగింది. ర్యాలీ అనంతరం డీఎన్పీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, కాంగ్రెస్ నేతలు డాక్టర్ మట్టా దయానంద్, పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు 20 మంది గెలిస్తే ప్రతి వార్డు అభివృద్ధికి ఒక్కో కోటి రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనని, కల్లూరును రాష్ట్రంలోనే నెంబర్వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. కార్యక్రమంలో అసుమర్తి చంద్రరావు, నీరజ ప్రభాకర్ చౌదరి, కుక్కా రానా, కర్నాటి రామకృష్ణారెడ్డి, 20 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


