కాళేశ్వరం దోపిడీకి.. గజ్వేల్ నుంచే గుణపాఠం!
కేసీఆర్కు ప్రజలు తగిన తీర్పు ఇవ్వాలి
ముంపు బాధితులకు పెండింగ్ ప్యాకేజీలు అమలు చేస్తాం
గజ్వేల్ అభివృద్ధికి అడిగినన్ని నిధులు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
కాకతీయ, గజ్వేల్ : కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న మాజీ సీఎం కేసీఆర్కు గజ్వేల్ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గజ్వేల్ పట్టణంతో పాటు నిర్వాసిత గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల ఇంచార్జి కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంక్షా రెడ్డితో కలిసి కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టుల వల్ల సర్వం కోల్పోయిన ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న ప్యాకేజీలను త్వరలోనే సీఎం రేవంత్రెడ్డితో చర్చించి అమలు చేయిస్తామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్పై నిప్పులు
కేసీఆర్, హరీష్రావుల తప్పుడు నిర్ణయాలతో మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని అందినంత దోచుకున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు. ప్రజల మధ్యకు రాని కేసీఆర్ ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా ముందుకు తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఇప్పటికే అనేక పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణానికి ఏటా రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
గజ్వేల్ మున్సిపల్ అభివృద్ధికి ప్రభుత్వం అడిగినన్ని నిధులు మంజూరు చేస్తోందని, ఇటీవలే రూ.18 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. మహిళల కోసం రూ.50 వేల కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో పేదలకు ఇండ్ల నిర్మాణ నిధులు, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి గజ్వేల్ను అభివృద్ధి బాటలో ముందుకు నడిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ ఎంపీపీ మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొనగారి రాజు తదితరులు పాల్గొన్నారు.


