కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ప్రజలు విసిగిపోయారు
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు
కాకతీయ, కొత్తగూడెం : పాల్వంచ పట్టణ సమగ్రాభివృద్ధి బీఆర్ఎస్ పాలనతోనే సాధ్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. శుక్రవారం పాల్వంచ మున్సిపాలిటీ 37వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మల్లెల స్వప్న కుమారి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను నేరుగా కలిసిన రేగా కాంతారావు, “పాల్వంచ–కొత్తగూడెం ప్రాంత అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలోనే వేగంగా జరిగింది. భవిష్యత్తులోనూ పట్టణానికి ప్రగతి దిశ చూపగల శక్తి బీఆర్ఎస్కే ఉంది” అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రైతుబంధు, మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం, తులం బంగారం, వృద్ధులకు రూ.4000 పెన్షన్, విద్యార్థులకు స్కూటీలు వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. “రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి పూర్తిగా విఫలమైంది” అని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పాల్వంచ కార్పొరేషన్పై మరోసారి గులాబీ జెండా ఎగరడం ద్వారానే పట్టణ అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ నేతృత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
గెలిపిస్తే వార్డును మోడల్గా తీర్చిదిద్దుతా – స్వప్న కుమారి
ఈ సందర్భంగా 37వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మల్లెల స్వప్న కుమారి మాట్లాడుతూ, తనను గెలిపించే బాధ్యత ప్రజలదైతే, వార్డును అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. “అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక వసతులను మెరుగుపరచడమే నా ప్రధాన లక్ష్యం. ఒక్క అవకాశం ఇవ్వండి – వార్డును ఆదర్శంగా నిలబెడతా” అని ఆమె ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు, యువజన విభాగం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


