ఇందిరమ్మ స్పూర్తితో రేవంత్ పాలన
సర్వేలన్నీ కాంగ్రెస్కే అనుకూలం
చేర్యాలలో కలిసి పని చేస్తే గెలుపు ఖాయం
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
కాకతీయ, చేర్యాల: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం చేర్యాల కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను వ్యక్తిగతంగా నిర్వహించిన సర్వేలో చేర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం ఉందని తెలిపారు. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇచ్చామని, నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే చేర్యాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో వర్గాలు లేవని, ఉన్నది ఒక్క కాంగ్రెస్ వర్గమేనని ఎంపీ స్పష్టం చేశారు. టిక్కెట్లు దక్కని నేతలు అసంతృప్తికి గురికాకుండా పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. వారికి భవిష్యత్తులో పార్టీ పదవులు, అభివృద్ధి పనుల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందని, దాన్ని ఎదుర్కొనేలా కాంగ్రెస్ సోషల్ మీడియాను బలోపేతం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి భారీ మెజారిటీతో గెలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


