రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
ఏడు రోజుల్లో లిఫ్ట్ మరమ్మతులు పూర్తి చేయాలి
ఆసుపత్రి వసతులపై కలెక్టర్ ఆదేశాలు
కాకతీయ, ఖమ్మం: ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో వసతులు తక్షణమే మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను కఠినంగా ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆసుపత్రి పనితీరు, పెండింగ్ అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన చర్చించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 స్పెషల్ రూముల మరమ్మత్తులను 15 రోజుల్లో పూర్తి చేయాలని, అత్యవసర అవసరాల కోసం రూ.5 లక్షలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా టాయిలెట్లు, సీవరేజ్ పనులు పూర్తి చేయాలని, రిజిస్ట్రేషన్ కౌంటర్ల రద్దీ తగ్గించేందుకు ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని సూచించారు. ఆసుపత్రిలో లిఫ్ట్ మరమ్మత్తులు ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏడు రోజుల్లో పూర్తిస్థాయిలో పనిచేయాలని గడువు విధించారు. పారిశుద్ధ్య పనులపై ఖర్చు చేస్తున్న రూ.55 లక్షలకు తగిన ఫలితాలు రావడం లేదని, పనితీరు మెరుగుపడకపోతే ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. మార్చి 15లోపు ఫైర్ సేఫ్టీ, సీసీ కెమెరాల ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


