కాంగ్రెస్–బీజేపీ పాలనలో అభివృద్ధి శూన్యం
తెలంగాణను నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే
హుజూరాబాద్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజం
కాకతీయ, హుజూరాబాద్ : గ్రామాలు, పట్టణాలకు నిజమైన అభివృద్ధి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని, కాంగ్రెస్–బీజేపీ పాలనల్లో ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా జరగలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఘాటుగా విమర్శించారు. గురువారం మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి 12, 14, 24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయనకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటి గురించి ప్రశ్నిస్తే తనపై కేసులు పెట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని కౌశిక్రెడ్డి ఆరోపించారు. వీణవంక జాతరకు వెళ్లినప్పుడు పోలీసులు తనను అడ్డుకున్నారని, తనను అడ్డుకోవడం వరకు పరవాలేదని, కానీ భార్యా బిడ్డలను అడ్డుకోవడం మాత్రం అన్యాయమని మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడే విషయంలో తాను ఎవరికీ భయపడబోనని స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలనలోనే మౌలిక వసతులు
ఇళ్ల ముందు రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కేసీఆర్ హయాంలోనే ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, పింఛన్లు, కల్యాణ లక్ష్మి, కంటి వెలుగు వంటి కీలక పథకాలను నిలిపివేసిందని తీవ్రంగా విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, పింఛన్ల పెంపు, ధాన్యానికి బోనస్, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీల్లో ఒక్కదాన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఇందుకు నిదర్శనంగా ప్రజల ముందు బాకీ కార్డులను ప్రదర్శించారు. ప్రస్తుతం యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్–బీజేపీ అభ్యర్థులు డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన కౌశిక్రెడ్డి, ప్రజలు మాత్రం ఆ ప్రలోభాలకు లొంగకూడదని పిలుపునిచ్చారు. డబ్బులు తీసుకున్నా సరే కారు గుర్తుకే ఓటు వేయాలని సూచించారు. కారు గుర్తు అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించే బలం వస్తుందని అన్నారు. ప్రజలకు అవసరం వచ్చిన ప్రతిసారీ తాను అండగా నిలుస్తానని ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు.


