ఎన్నికల విధుల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలి
పారదర్శకంగా గుర్తుల కేటాయింపునకు కలెక్టర్ ఆదేశం
అధికారులు పూర్తిస్థాయి అవగాహనతో పనిచేయాలి
వైరాలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం :మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. నిబంధనల మేరకు ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
మంగళవారం వైరా తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల గుర్తుల కేటాయింపు ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని వార్డు అభ్యర్థుల బీ-ఫామ్ పరిశీలన, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు తీరును ఆయన తనిఖీ చేశారు. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలు, బీ-ఫామ్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నోడల్ అధికారులు, స్పెషల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ప్రతి చర్య చేపట్టాలని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలని తెలిపారు. ఎన్నికలకు కేటాయించిన అధికారులు నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, చిన్నపాటి తప్పిదాలకు కూడా ఆస్కారం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
నామినేషన్ల ఉపసంహరణ, రాజకీయ పార్టీల బీ-ఫామ్ పరిశీలన ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశాలని ఆయన పేర్కొన్నారు. బీ-ఫామ్ లేని అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటించడం, వారికి గుర్తుల కేటాయింపు వంటి ప్రక్రియలు పూర్తిగా పారదర్శకంగా జరగాలని చెప్పారు. ఎలాంటి తొందరపాటు లేకుండా ప్రతి దశను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ర్యాలీలు, సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సౌండ్ సిస్టమ్, ప్రచార వాహనాల వినియోగానికి కూడా ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఒకే రూట్లో వేర్వేరు పార్టీల సమావేశాలు లేదా ర్యాలీలకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలను కట్టడి చేయాలని ఆయన హెచ్చరించారు. అక్రమంగా నగదు, మద్యం తరలిస్తే వెంటనే పట్టుకుని సీజ్ చేయడం జరుగుతుందని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో వైరా తహసీల్దార్ సురేష్బాబు, మున్సిపల్ కమిషనర్ గురులింగం, ఎంపీడీవో తేజావత్ సక్రియ, ఎంఈఓ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.


