అభ్యర్థుల చేతికి బీ-ఫామ్లు… ప్రచారానికి శ్రీకారం!
ఏదులాపురం మున్సిపల్ పోరులో హస్తం దూకుడు
అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన మంత్రి పొంగులేటి
కాకతీయ, కూసుమంచి: ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ కీలక దశను పూర్తి చేసింది. తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంగళవారం పార్టీ అభ్యర్థులకు అధికారిక బీ-ఫామ్లు అందజేశారు. దీంతో మున్సిపల్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాయి.
గెలుపే లక్ష్యంగా కార్యాచరణ
బీ-ఫామ్లు అందుకున్న అభ్యర్థులు వెంటనే ఎన్నికల అధికారులకు నామినేషన్లు దాఖలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. “ప్రజారంజక పాలనను వివరించి, ఓటర్ల మద్దతు సంపాదించాలి. ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి” అని దిశానిర్దేశం చేశారు.
క్లీన్ స్వీపే లక్ష్యం
వార్డుల వారీగా కార్యకర్తలను సమన్వయం చేసుకుని సమష్టిగా పనిచేయాలని, ప్రత్యర్థుల వ్యూహాలను సమర్థంగా ఎదుర్కొనాలని మంత్రి సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి చేతుల మీదుగా బీ-ఫామ్లు అందుకున్న అభ్యర్థులు రెట్టింపు ఉత్సాహంతో ప్రచార రంగంలోకి అడుగుపెట్టారు. మున్సిపల్ కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమరసన్నద్ధమవుతున్నాయి.


