హైస్కూల్లో మిన్నంటిన క్రీడా ఉత్సాహం
వైభవంగా ప్రారంభమైన ‘సీఎం కప్–2026’ పోటీలు
కాకతీయ, కామేపల్లి: తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సీఎం కప్–2026’ క్రీడా సంబరాలు కామేపల్లి మండలం గోవింద్రాల బంజారా హైస్కూల్ ప్రాంగణంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, యువత క్రీడా స్ఫూర్తితో ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, “క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు… క్రమశిక్షణ, పట్టుదల, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పునాది” అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే సీఎం కప్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రవీందర్ మాట్లాడుతూ క్రీడల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయడం జరిగిందని, క్రీడా స్ఫూర్తిని చాటేలా పోటీలు నిర్వహించాలని సూచించారు. మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) వెంకట్ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని వివరించారు.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువతీ యువకులు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ తదితర పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. సీఎం కప్ ద్వారా గ్రామీణ క్రీడాకారులకు జాతీయ స్థాయి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చేస్తున్న కృషిని అతిథులు అభినందించారు.
ఈ సందర్భంగా రాంరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, “ఓటమిని గెలుపుకు మెట్టుగా మార్చుకుని ముందుకు సాగాలి. క్రీడాకారుల భవిష్యత్తుకు సీఎం కప్ మంచి వేదిక” అని హితవు పలికారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, గోవింద్రాల సర్పంచ్ బానోత్ కమల, దేవయ్య, ఉప సర్పంచ్ ఆలోత్ తారదేవి, శివ, లక్ష్మీనారాయణ, లావుడ్యా వినోద్, సన్నీ, మూడ్ భావ్ సింగ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. గెలుపొందిన జట్లను మండల స్థాయి నుంచి తదుపరి దశ పోటీలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.


