బీఫాం ఎవరికి..?
కొత్తగూడెం కార్పోరేషన్ ఎన్నికల్లో సస్పెన్స్
సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం
ఇప్పటికే రెండు పార్టీల ఆశావహులు నామినేషన్లు దాఖలు
పొత్తుతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టమంటూ ఆరాలు
సీపీఐ–కాంగ్రెస్ పొత్తుపై రెండు పార్టీల శ్రేణుల్లో ఆందోళన
బీ–ఫామ్ కోసం అభ్యర్థుల మల్లగుల్లాలు
కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్త ముఖాల ఎంట్రీ?
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ–కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉందా? లేదా? అన్న ప్రశ్నకు స్పష్టత లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు పొత్తు ఖాయమంటూ ప్రచారం జరుగుతుండగా, మరోవైపు లేదంటూ పుకార్లు షికార్లు చేయడంతో ఇప్పటికే నామినేషన్లు వేసిన ఆశావహులు బీ–ఫామ్ ఎవరికొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అన్ని పార్టీల్లోనూ ‘మీదే టికెట్’ అన్న భరోసాలతో వందల సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ పార్టీ తరఫున అధికారికంగా బీ–ఫామ్ ఎవరికిస్తారన్నది తేలకపోవడంతో చివరికి గందరగోళమే మిగిలింది. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసినా, అభ్యర్థుల భవితవ్యం మాత్రం ఇంకా సస్పెన్స్లోనే ఉంది.

బీ–ఫామ్ ఎవరికీ? కొత్తగూడెంలో హాట్ టాపిక్
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహంతో అన్ని పార్టీల్లోనూ తీవ్ర పోటీ నెలకొంది. బీ–ఫామ్ల కేటాయింపు ఆయా పార్టీల ముఖ్య నేతలకు పెద్ద సవాల్గా మారింది. పొత్తుపై స్పష్టత లేకపోవడంతో సీపీఐ–కాంగ్రెస్ ఆశావహులు అయోమయంలో పడగా, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం అభ్యర్థుల ఎంపికను చాకచక్యంగా పూర్తి చేస్తున్నాయన్న చర్చ వినిపిస్తోంది. నామినేషన్లు వేసిన అభ్యర్థులు బీ–ఫామ్ వస్తుందన్న ఆశతో పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా, కొందరు మాత్రం పార్టీ జెండాలతో మాకేం పనంటూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. బీ–ఫామ్ ఎవరికీ దక్కుతుందన్నది భద్రాద్రి జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్గా మారింది.
కొత్తగూడెం పోరులో కొత్త ముఖాలు
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ను మొత్తం 60 డివిజన్లుగా విభజించగా, పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో యువత రాజకీయ అరంగేట్రం చేసింది. ప్రధాన పార్టీల బీ–ఫామ్ కోసం ఎదురుచూస్తున్న నూతన ఆశావహులతో పాటు, స్వతంత్రులుగా పోటీ చేస్తున్నవారూ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. తల పండిపోయిన రాజకీయ నాయకత్వానికి ప్రజలు విసుగుపడుతున్నారని, ఈసారి విద్యావంతులు, కొత్తతరం నాయకత్వానికి ప్రజలు అవకాశం ఇస్తారని యువ అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్త ముఖాల సందడి స్పష్టంగా కనిపిస్తోంది.
నామినేషన్లపై పోలీస్ నిఘా
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో విజయవంతంగా ముగిసింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కొనసాగిన నామినేషన్ల ప్రక్రియను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్వయంగా పరిశీలించారు. నామినేషన్ పత్రాల స్వీకరణపై ఎన్నికల సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో డీఎస్పీ ఆదినారాయణ, సీఐలు కరుణాకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి… నామినేషన్లు ముగిశాయి గానీ, బీ–ఫామ్ సస్పెన్స్ మాత్రం కొత్తగూడెంలో రాజకీయ ఉష్ణోగ్రతను మరింత పెంచుతోంది.


